Brij Bhushan Singh: భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధిపతి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై పోక్స్ చట్టం కింద లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును ఢిల్లీ కోర్టు సోమవారం అంగీకరించింది. కేసును కొట్టివేయడాన్ని అంగీకరిస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి గోమతి మనోచా వెల్లడించారు. ఈ కేసును మైనర్ అయిన రెజ్లర్ దాఖలు చేసింది. గతేడాది రెజ్లర్లు చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోర్టు క్లోజర్ రిపోర్టును అంగీకరించడంతో కేసు ముగిసింది.
జూన్ 13, 2023న సమర్పించబడిన క్లోజర్ రిపోర్టు ప్రకారం.. రెజ్లర్ తండ్రి తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్తో వ్యక్తిగత విభేదాలను పరిష్కరించుకోవడానికి తప్పు ఫిర్యాదు చేశానని దర్యాప్తులో అంగీకరించాడు. దీని ఆధారంగా ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించే ఆధారాలు లేవని తేల్చి కేసును రద్దు చేయాలని కోరారు. ఆగస్టు 1, 2023న జరిగిన ఇన్-ఛాంబర్ విచారణలో ఫిర్యాదుదారుడు దర్యాప్తుతో సంతృప్తి చెందానని, కేసు ముగింపుకు వ్యతిరేకం కాదని న్యాయమూర్తికి తెలియజేశారు. మే 26,స 2025న ధ్రువీకరణ కోసం ఫిర్యాదుదారును మళ్లీ పిలిపించిన న్యాయమూర్తి గోమతి మనోచా ముందు ఇది తిరిగి ధ్రువీకరించబడింది.

పోక్సో కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఉపశమనం లభించినప్పటికీ.. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో అతను విచారణను ఎదుర్కొంటున్నాడు. ఆ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో పలు సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది. అదే కేసులో ఆయన సహచరుడు వినోద్ తోమర్ పేరు కూడా ఉంది. ఐపీసీ సెక్షన్లు 109, 506 కింద అదనపు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఇప్పటికే ఆదేశించింది. విచారణ ప్రక్రియలు కొనసాగనున్నాయి. ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించాల్సి ఉంది. మరో వైపు బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలన్నింటినీ నిరంతరం ఖండిస్తూ వచ్చారు.