వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా రచించిన 'లారా.. ది ఇంగ్లండ్ క్రోనికల్స్' పుస్తకం గురించి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిలో తన క్రికెట్ ప్రయాణంలో ప్రముఖ సంఘటనల గురించి లారా వివరించాడు. అయితే వాటిలో కొన్ని వివాదాస్పదంగా కూడా మారాయి. వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు సర్ వివ్ రిచర్డ్స్, కార్ల్ హూపర్ ఈ పుస్తకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఈ నేపథ్యంలో 18 ఏళ్ల క్రితం జరిగిన ఎంఎస్ ధోనీ-బ్రియాన్ లారా వాగ్వాదం నెట్టింట వైరల్గా మారుతోంది. 2006లో వెస్టిండీస్ పర్యటనకు రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు వెళ్లింది. నాలుగు టెస్టుల సిరీస్ను 1-0తో టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో వివాదాస్పద సంఘటన జరిగింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 241 పరుగులకు ఆలౌటైంది. తర్వాత వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. ఆరు వికెట్లకు 521 పరుగులకు డిక్లేర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఎంఎస్ ధోనీ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 52 బంతుల్లో 69 పరుగులు చేశాడు. అయితే 151 ఓవర్లో ధోనీ మూడు సిక్సర్లు బాదాడు. నాలుగో సిక్సర్కు ప్రయత్నించగా బౌండరీ లైన్లో ఫీల్డర్ డారెన్ గంగా చేతికి చిక్కాడు.
కానీ డారెన్ గంగా బౌండరీ లైన్ను తాకకుండా క్యాచ్ను అందుకున్నాడా అనేది స్పష్టంగా కనిపించలేదు. దీంతో అంపైర్లు ఔట్ ఇవ్వడానికి చాలా సమయాన్ని తీసుకున్నారు. ఇతర కోణాల్లో చూసినా స్పష్టత లభించలేదు. ఈ లోపు మైదానంలో వెస్టిండీస్ కెప్టెన్ లారా రచ్చరచ్చ చేశాడు. ధోనీ, అంపైర్లతో ఆవేశంగా మాట్లాడాడు. తమ ప్లేయర్లు నిజాలే చెబుతారని, బౌండరీ రోప్ టచ్ కాలేదని వాదించాడు. ధోనీ దగ్గరకు వచ్చి కోపంగా.. ఔట్ అని, మైదానాన్ని వీడాలని అన్నాడు.
మరోవైపు డ్రెస్సింగ్ రూమ్ నుంచి రాహుల్ ద్రవిడ్ ధోనీకి సిగ్నల్ ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయమని సూచించాడు. దీంతో ఆ గొడవను ధోనీ వదిలేసి కైఫ్తో కలిసి మైదానాన్ని వీడాడు. ధోనీ అంగీకరించడంతో దాన్ని అంపైర్లు ఔట్గా ప్రకటించారు. దీని గురించి ధోనీ తర్వాత మాట్లాడుతూ..'లారా చెప్పడంతో మైదానం నుంచి వెళ్లాలనకున్నా. అయితే నేను ఔట్ అనేది స్పష్టం చెప్పలేం. ఫీల్డర్ క్యాచ్ అందుకున్న సమయంలో అతని వెనుక ఏం జరుగుతుందో, రోప్ టచ్ చేశాడో లేదో అనేది తనకి కచ్చితంగా తెలియదు'' అని ధోనీ అన్నాడు. కాగా, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆఖరి వికెట్ను కాపాడుకుని వెస్టిండీస్ ఓటమి నుంచి బయటపడింది.