టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 175 పరుగుల(258 బంతుల్లో) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్ మెరుపు బ్యాటింగ్ను చూసి విస్మయం చెందిన వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా.. ఈ యువ ఓపెనర్ను ప్రత్యేకంగా అభ్యర్థించాడు. దయచేసి తమ బౌలర్లపై కాస్త కరుణ చూపించమని లారా జైస్వాల్ను కోరాడు.
జైస్వాల్ను హత్తుకుని అభినందించిన లారా
అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 518 పరుగులు చేసింది. బీసీసీఐ ఆదివారం ఉదయం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఓ వీడియోను పంచుకుంది. అందులో లారా జైస్వాల్ను ఆప్యాయంగా కౌగిలించుకుని అభినందించారు. అనంతరం లారా జైస్వాల్ను ఉద్దేశించి, "మా బౌలర్లను అంతలా బాదకు" అంటూ ప్రత్యేక విజ్ఞప్తి చేయడం గమనార్హం. వెస్టిండీస్ బౌలర్ల ముందు జైస్వాల్ స్టైలిష్ షాట్లతో రెచ్చిపోవడంతో లారా ఈ విధంగా సరదాగా కోరినట్లు తెలుస్తోంది.

జైస్వాల్ ఈ మ్యాచ్లో తన మూడో డబుల్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. డబుల్ సెంచరీ మిస్సయినందుకు తాను చింతించడం లేదని, ఇదంతా ఆటలో భాగమని జైస్వాల్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ సమయంలో తన ఆలోచనా విధానం గురించి యశస్వి జైస్వాల్ మాట్లాడారు. తాను ఎప్పుడూ వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. "నేను ఎప్పుడూ జట్టుకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. నా జట్టు కోసం నేను ఎలా ఆడగలను, ఆ సమయంలో జట్టుకు ఏది ముఖ్యం అని ఆలోచిస్తాను. వికెట్ ఎలా ఉంది, నేను అక్కడ ఉన్నప్పుడు, వీలైనంత ఎక్కువసేపు ఉండేలా చూసుకుంటాను. అందుకే నాకు మంచి ఆరంభం లభిస్తే, దానిని పెద్ద ఇన్నింగ్స్గా మార్చేలా చూసుకుంటాను. ఇదే నా ఆలోచన" అని జైస్వాల్ వివరించారు.
సుదర్శన్, గిల్తో భాగస్వామ్యంపై స్పందన
ఢిల్లీ టెస్ట్ మొదటి రోజు రెండో, మూడో సెషన్లలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్తో కలిసి రెండో వికెట్కు 193 పరుగులు జోడించారు. సుదర్శన్ 165 బంతుల్లో 87 పరుగులు చేశాడు. సుదర్శన్ బాగా ఆడాడని జైస్వాల్ ప్రశంసించాడు. అలాగే శుభ్మన్ గిల్ (129 నాటౌట్) గురించి మాట్లాడుతూ, "గిల్ భాయ్ ఎప్పుడూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు. కొత్త బంతి వస్తే, దాన్ని ఉపయోగించుకుని పరుగులు చేయాలి. ఆయనతో బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. ఆయన బ్యాటింగ్ చేసే విధానం, ఆటను ముందుకు తీసుకెళ్లే తీరు అద్భుతం" అని అన్నారు. శనివారం ఉదయం జైస్వాల్ తన మూడో డబుల్ సెంచరీని పూర్తి చేయాల్సి ఉంది, కానీ 92వ ఓవర్లో గిల్తో ఏర్పడిన అపార్థం కారణంగా రనౌట్ అయ్యాడు.