
జమైకా: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ లాక్డౌన్ సమయాన్ని ప్రతి ఒక్క ప్లేయర్ ఆస్వాదిస్తున్నారు. అందరిలానే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా కూడా తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. అయితే బ్రియన్ లారా ఇన్స్టాగ్రామ్లో 2003లో ఓ అభిమానితో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.
బ్రియన్ లారా ఇన్స్టాగ్రామ్లో 2003లో ఓ అభిమానితో దిగిన ఫోటోను తాజాగా పోస్ట్ చేశాడు. ఎవరీ యువకులు. ఫ్యాన్ మూమెంట్ అని నాకు అర్థమైంది. అతడే తర్వాతి కాలంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అతనెవరో మీరే చెప్పండి అంటూ అభిమానులతో 2003 నాటి ఫోటోను పంచుకున్నాడు. ఇంతకీ ఆ స్పెషల్ ఆటగాడు ఎవరో మీరు గుర్తుపట్టారా?. ఒకప్పటి అండర్19 జట్టులో సర్కిల్ చేసిన యువకుడే అతను. అతడే భారత స్టైలీష్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా.
లారా పోస్ట్కు రైనా బదులిస్తూ.. 'నిజానికి చాలా ప్రత్యేకమైన సందర్భం. నా అభిమాన క్రికెటర్తో దిగిన మధుర క్షణం అది. అండర్ 19 జట్టుకు ఆడే సమయంలో మేమందరం హెతిరో విమానాశ్రయంలో దిగాం. మా ముందే ఉన్న దిగ్గజ క్రికెటర్ లారాను చూసి నమ్మలేకపోయా. ఆరోజు మిమ్మల్ని కలవడం, మీతో కలిసి ఫోటో దిగడం, నాలో నూతన ఉత్తేజాన్ని ఇచ్చినట్టయింది. ఆరోజు నుంచి వెనక్కుతిరిగి చూసుకోలేదు. దేశం కోసం ఆడటం, ఉత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టిపెట్టా' అంటూ కామెంట్ చేశాడు.
రైనా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరఫున తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దశాబ్దం క్రితం పొట్టి ఫార్మాట్లో టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా భారత్ తరఫున తొలి సెంచరీ నమోదు చేసాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో మే 2, 2010న జరిగిన మ్యాచ్లో సురేశ్ రైనా (101: 60 బంతుల్లో 9x4, 5x6) మెరుపు సెంచరీ చేశాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఇదే తొలి సెంచరీ కాగా.. అప్పటి నుంచి రైనాని టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు.
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.