
దుబాయ్: ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్స్తోనే సంతృప్తి పడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 13 ఏళ్లుగా టైటిల్ సాధించాలని కలలు కంటున్నా.. కోహ్లీసేనకు భంగపాటు తప్పలేదు. లీగ్ దశలో రన్రేట్ కారణంగా అనూహ్యంగా ప్లేఆఫ్స్కు చేరినా.. ఇక్కడ విజయం దక్కలేదు. దీంతో బెంగళూరు వైఫల్యంపై, కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంపై పలువురు మాజీలు స్పందించారు. బెంగళూరు బాగా ఆడినా కొన్నిసార్లు మాత్రం నిలకడ కోల్పోయిందని విండీస్ దిగ్గజం బ్రియన్ లారా పేర్కొన్నాడు.
తాజాగా బ్రియన్ లారా మాట్లాడుతూ... 'ఈ సీజన్లో బెంగళూరు మంచి క్రికెట్ ఆడింది. అయితే కొన్నిసార్లు మాత్రం నిలకడ కోల్పోయింది. టాప్ రెండులో నిలిచే అవకాశం దక్కినా.. దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. ఫలితంగా మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడా జట్టు చేయాల్సిన పని ఏంటంటే పరిస్థితులని అర్థం చేసుకోవడం. విరాట్ కోహ్లీ-ఏబీ డివిలియర్స్పైనే అతిగా ఆధారపడటాన్ని గుర్తించాలి. ఆ పరిస్థితి మారి ముందుకు సాగాలి' అని అన్నాడు.
'బెంగళూరు ఆలోచించాల్సిన విషయం శివమ్ దూబె స్థానం మీద. అతడికి సరైన అవకాశం ఇవ్వాలనేదానిపై కసరత్తు చేయాలి. అతడిని కిందకు నెట్టి వాషింగ్టన్ సుందర్ను పైకి తీసుకొచ్చారు. అతడికి సరైన అవకాశం ఇచ్చి ఆడమని చెబితే అది ఉపయోగపడే అవకాశం ఉంది. బెంగళూరుకు ఐదో స్థానంలో ధాటిగా ఆడే బ్యాట్స్మన్ ఉంటే కోహ్లీ-డివిలియర్స్పైన ఒత్తిడి తగ్గుతుంది' అని భారత మాజీ ఓపెనర్ సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.
'విరాట్ కోహ్లీ- ఏబీ డివిలియర్స్పైనే బెంగళూరు అతిగా ఆధారపడిందని అనుకుంటున్నా. వీరిద్దరూ గొప్ప ఆటగాళ్లు. అయితే బెంగళూరు జట్టు నిర్మాణంలో మార్పులు చేయాల్సి ఉంది. ఈ పొట్టి క్రికెట్లో అందరూ ఓడిపోతారు. అది సహజమే. అలాగే యువకులకు అవకాశాలు ఇవ్వాలి. దేవ్దత్ పడిక్కల్ కచ్చితంగా భవిష్యత్ ఆటగాడిగా మారతాడు' అని ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్లీ చెప్పుకొచ్చాడు.
శుక్రవారం అబుదాబి వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 131/7 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (56) అర్ధ శతకంతో రాణించాడు కానీ లేదంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. ఛేదనలో హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేన్ విలియమ్సన్ (50), జేసన్ హోల్డర్ (24) రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.