
సిడ్నీ: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన క్రికెట్ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ ప్లేయర్లకు ట్రైనింగ్ను ప్రారంభించగా.. నేషనల్ క్యాంపు నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా యోచిస్తోంది. మరోవైపు వచ్చే జూలైలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సంబంధించి వెస్టిండీస్ క్రికెటర్లు ట్రైనింగ్ను ప్రారంభించారు. మునుపటి ఫిట్నెస్ సాధించేందుకు ఆటగాళ్లు మైదానాల్లో శ్రమిస్తున్నారు. అయితే లయ అందుకోవడం బౌలర్లకు కష్టమవుతుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. ఏ ఫార్మాటైనా మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని చెప్పాడు.
స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో బ్రెట్ లీ పాల్గొనగా.. లాక్డౌన్ ముగిశాక బౌలర్లు, బ్యాట్స్మెన్లో లయ అందుకోవడం ఎవరికి కష్టంగా మారుతుందని ప్రశ్నించగా ఇద్దరికీ కష్టమే అన్నాడు. 'ఫామ్ అందుకోవడానికి బౌలర్లకు మరికొంత ఎక్కువ సమయం పట్టొచ్చు. మునుపటిలా పూర్తి స్థాయిలో వేగం అందుకోవాలంటే సాధారణంగా 6-8 వారాలు పడుతుంది. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ ఫిట్నెస్కు ఎనిమిది వారాలు అవసరం. ముఖ్యంగా బౌలర్లకు కష్టంగానే ఉంటుంది' అని లీ అన్నాడు. టెస్టు క్రికెట్కు 8-12 వారాలు, వన్డేలకు ఆరు వారాలు, టీ20లకు 5-6 వారాల సమయం అవసరమని ఇప్పటికే ఐసీసీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ తరంలో గొప్ప క్రికెటర్లైన విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్లో ఎవరు అత్యుత్తమో ఎంచుకోవడం చాలా కష్టమని బ్రెట్ లీ అన్నాడు. ఇద్దరూ అద్భుతంగా ఆడతారన్నాడు. ఇప్పటికిప్పుడు ఎంచుకోమంటే మాత్రం స్మిత్కే ఓటేస్తానని, అదే రేపు అడిగితే కోహ్లీ పేరు చెప్పొచ్చని వెల్లడించాడు. 'స్మిత్, కోహ్లీలలో ఒకర్ని ఎంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే.. వారిద్దరిలోని చాలా లక్షణాలను నేను ఇష్టపడతాను. అయితే బౌలింగ్ దృష్టికోణం నుంచి వివరిస్తా. స్మిత్, కోహ్లీ భిన్నమైన ఆటగాళ్లు. కోహ్లీ గురించి చెప్పాలంటే.. సాంకేతికంగా బలమైనవాడు. 'వి' షేపు నుంచి బంతిని తరలిస్తాడు. కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా ఆఫ్సైడ్ ది ఆఫ్స్టంప్ బంతులకు దొరికిపోయేవాడు. ఇప్పుడెంతో మెరుగయ్యాడు. ఎంతో సాధన చేసి తన బలహీతనను అధిగమించాడు. కోహ్లీ చాలా క్రమశిక్షణతో ఆడతాడు. దేహదారుడ్యంలో తిరుగులేదు. సారథ్యం అమోఘం' అని బ్రెట్ లీ అన్నాడు.
కరోనా వైరస్ ముప్పుతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ వాయిదా పడింది. ఆటను తిరిగి ఎలా ఆరంభించాలా అని అన్ని దేశాల బోర్డులు, ఐసీసీ ఆందోళన చెందుతున్నాయి. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించకుండా పునః ప్రారంభం చేసేందుకు ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, క్రిస్వోక్స్ తమ కౌంటీ మైదానాల్లో వ్యక్తిగతంగా సాధన చేస్తున్నారు. బీసీసీఐ కాంట్రాక్టున్న వారిలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే శిక్షణ ఆరంభించాడు. కెన్సింగ్టన్ ఓవల్లో తాజాగా కెప్టెన్ జాసన్ హోల్డర్, క్రెయిగ్ బ్రాత్వైట్, షాయ్ హోప్, కీమర్ రోచ్, షేన్ డౌరిచ్, షమార్ బ్రుక్స్, రేమన్ రీఫర్లు ఖాళీ స్టేడియంలో ట్రైనింగ్ తీసుకున్నారు.