
సిడ్నీ: కోకాబుర్రా బంతితో సహజంగా ఎక్కువ స్వింగ్ రాదని, సెలైవా (ఉమ్మి) నిషేధం వల్ల వాటిపై ప్రభావం ఎక్కువగా ఉండదని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్ల ఆరోగ్యం దృష్ట్యా బంతికి ఉమ్మి రుద్దడాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మి పూయకపోతే.. బాల్ స్వింగ్ అయ్యే విధానంలో మార్పు వస్తుందని, ఇది బౌలర్ ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని చాలా మంది మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గం ఐసీసీ ఆలోచించాలని చాలా మంది మాజీ ఆటగాళ్ళు సూచించారు.
సెలైవా నిషేధంపై తాజాగా బ్రెట్ లీ మాట్లాడుతూ... 'ఇది ఖచ్చితంగా బౌలర్లకు ప్రతికూలత అని నేను అనుకుంటున్నాను. దీని కంటే క్రికెటర్లు మైదానంలోకి వెళ్ళేముందు వారందరికి వైరస్ పరీక్షలు చేస్తే బాగుంటుంది. టెస్టుల్లో క్లియర్ అయిన వారిని మాత్రమే మైదానంలోకి అనుమతించడం దీనికి మరో మార్గమని నేను భావిస్తున్నా. ఏది ఏమైనప్పటికి సెలైవా బ్యాన్ వల్ల కోకాబుర్రా బాల్స్ స్వింగ్లో ఎక్కువగా మార్పు రాదు. దీని వల్ల రివర్స్ స్వింగ్ కూడా పెద్దగా ఉండదు. దాంతో సెలైవా రుద్దినా.. రుద్దకపోయినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు' అని అన్నాడు.
యో సెక్యూర్ వాతావరణంలో చాలా రోజుల తరువాత ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు మొదలయ్యాయి. ఈ రెండు జట్టులు మూడు టెస్ట్ సిరీస్లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ గెలిచింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. అతని బౌలింగ్లో ఇంతకు ముందు ఉన్న స్వింగ్ కనిపించడం లేదని అంటున్నారు. దీనిపై బ్రెట్లీ మాట్లాడుతూ... 'ఇంగ్లండ్ చాలా రోజుల తరువాత మ్యాచ్ ఆడింది. అందుకే ఇలా జరిగింది. అంతే కానీ సెలైవా ఎఫెక్ట్ అంతలా ఉండదు' అని అభిప్రాయపడ్డాడు.
భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'మ్యాచ్ ఆడే ముందు ఆటగాళ్లను పరీక్షిస్తారు (కొవిడ్-19 పరీక్షలు). వాళ్లకు కరోనా నెగటివ్ వస్తే.. బంతిపై ఉమ్మి రాసేందుకు అనుమతించడం గురించి ఐసీసీ ఆలోచించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వైద్య రంగంలో ఉన్న వాళ్లు దీని గురించి ఇంకా బాగా చెబుతారేమో' అని అన్నాడు.
కరోనా వైరస్ ఉమ్మితో వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో దాన్ని నిషేధం విధించిన ఐసీసీ.. చెమటను వినియోగించేందుకు మాత్రం అనుమతిచ్చింది. టెస్టుల్లో బౌలర్లు బంతిపై ఉమ్మి ఉపయోగిస్తే.. అలవాటు పడే వరకు అనుమతిస్తారు. అయితే అదేపనిగా ఉమ్మిని వాడితే.. ఇన్నింగ్స్కు రెండు సార్లు హెచ్చరిస్తారు. అప్పటికీ సదరు ఆటగాడిలో మార్పు రాకుంటే..పెనాల్టీ కింద బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు జతచేస్తారు. అంటే బౌలింగ్ చేసే జట్టు అందనంగా 5 రన్స్ ఇచ్చుకోవడమే.