టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవలే ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పంజాబ్తో ఆడిన మ్యాచులో శామ్ కర్రాన్, హర్ప్రీత్ సింగ్ ఇద్దరూ అర్జున్ బౌలింగ్లో చెలరేగారు. కేవలం ఒక్క ఓవర్లోనే 31 పరుగులు పిండుకున్నారు. దీంతో అతనిపై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగింది. అయితే లెజెండరీ పేసర్ బ్రెట్ లీ మాత్రం అర్జున్కు మద్దతుగా నిలబడ్డాడు.
అర్జున్ను ట్రోల్ చేస్తున్న వారందరూ కీబోర్డ్ వారియర్లని, వాళ్లకు మరో పని ఉండదని విమర్శించాడీ లెజెండ్. 'అర్జున్ బౌలింగ్ చూసి నేను చాల ఇంప్రెస్ అయ్యా. ముంబై తరఫున అతను మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. కొత్త బంతితో అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముంబై టీంలో అందరి కన్నా ఎక్కువగా బంతిని స్వింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతన్ని మిడిల్ ఓవర్లలో వాడుకోవడం బెటర్. అనుభవం పెరిగేకొద్దీ డెత్ ఓవర్లలో కూడా రాణిస్తాడు' అని బ్రెట్ లీ చెప్పాడు.

ప్రస్తుతం ప్రజలు ప్రతి చిన్న విషయంపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడిన బ్రెట్ లీ.. అర్జున్ కూడా ఇలాగే విమర్శలు ఎదుర్కొంటున్నాడని చెప్పాడు. అర్జున్ బౌలింగ్లో వేగం లేదని, నిలకడగా 130 కిలోమీటర్ల వేగంతో కూడా బౌలింగ్ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన బ్రెట్ లీ.. ఇలాంటి ట్రోలింగ్ను అర్జున్ పట్టించుకోకూడదని చెప్పాడు. సచిన్ కూడా తన కెరీర్లో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న వాడేనని, కాబట్టి అర్జున్ వీటిని పట్టించుకోకూడదని సలహా ఇచ్చాడు.
'జట్టులో బౌలింగ్ చేయడంలో కంఫర్ట్ ఫీల్ అయితే.. అతను కూడా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. ఇంత భారీ క్రౌడ్ ముందు ఆడేటప్పుడు ఆటోమేటిక్గా పేస్ కూడా పెరుగుతుంది. తన బౌలింగ్ పేస్లో నాకేం సమస్య కనిపించడం లేదు. తను ఎంత వేగంగా బౌలింగ్ చేయగలడో నాకు తెలుసు. మంచి ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ అతను' అని అర్జున్ను మెచ్చుకున్నాడు. అందుకే ఇప్పుడు ట్రోల్ చేస్తున్న వారిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోవాలని సలహా ఇచ్చాడు.