ప్రపంచకప్ ప్లేస్లో ఐపీఎల్
టీ20 ప్రపంచకప్ నిర్వహణ అంశంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని ఇటీవల ఐసీసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ను తదుపరి ఏడాదికి వాయిదా వేస్తూ ముందుగానే నిర్ణయం తీసుకోవాలని బ్రెండన్ మెక్కలమ్ సూచించాడు. 'టీ20 ప్రపంచకప్ వాయిదా పడి.. అక్టోబర్లో ఐపీఎల్ 2020 జరుగుతుందని నేను అనుకుంటున్నా. విశ్వ టోర్నీని ప్రేక్షకులు లేకుండా జరుపడాన్ని చూడలేను. స్టేడియాలను మూసివేసి క్రికెట్ మ్యాచ్లను ఆటగాళ్లతోనే నిర్వహిస్తే అసలు మజానే ఉండదు' అని మెక్కలమ్ అన్నాడు.
ఐపీఎల్ ఖాళీ స్టేడియాల్లో నిర్వహించొచ్చు
'ఐపీఎల్ 2020ని ఖాళీ స్టేడియాల్లో కూడా నిర్వహించొచ్చు. ఎందుకంటే భారత్లో టీవీల ద్వారా క్రికెట్ను చూసేవాళ్లు ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు ఆదాయానికి గండి పడకుండా ఉంటుంది. మరోవైపు స్టేడియాల్లో ప్రేక్షకుల మధ్యే ప్రపంచకప్ మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీ కూడా భావిస్తుంది. 16 జాతీయ జట్లు ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 20 లక్షలకు పైగా మంది ప్రభావితులు అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్లో ప్రపంచకప్ మాటను ఐసీసీ వదులుకోవాలి' అని మెక్కలమ్ అన్నాడు.
ప్రతీఒక్కరూ క్షేమంగా ఉండాలి
క్రీడలు తిరిగి ప్రారంభమవుతాయని, అంతకంటే ముందు ప్రజలు సురక్షితంగా ఉండాలని మెక్కలమ్ సూచించాడు. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులపైనే ప్రస్తుతం నా ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి. సమయాన్ని బట్టి క్రీడలు మళ్లీ ప్రారంభమవుతాయి. కానీ ఇప్పుడు ప్రతీఒక్కరూ క్షేమంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని అధిగమించే మార్గాన్ని కనుగొనాలి. ఇదివరుకెన్నడూ లేనివిధంగా మన తరం కన్నా ముందే వైద్య విభాగం, ఆర్థిక అంశాల్లో ముందున్నాం' అని మెక్కలమ్ పేర్కొన్నాడు.
ప్రపంచకప్ నిర్వహణపై అనుమానాలు
ప్రమాదకర కరోనా వ్యాప్తి కారణంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 మొదటగా ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. భారత్లో మే 3వ తేదీ వరకూ లాక్డౌన్ విధించడంతో.. టోర్నీ నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 30వ తేదీ వరకు దేశ సరిహద్దులను ఆస్ట్రేలియా మూసివేయడంతో ప్రపంచకప్ నిర్వహణపై అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి.