హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో ఆడినందుకు తనకు రావాల్సిన మొత్తం సొమ్ముని వేలంలో కొనుగోలు చేసిన గుజరాత్ లయన్స్ ప్రాంఛైజీ ఇవ్వలేదని ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ వాపోయాడు.
న్యూజిలాండ్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని మెక్కల్లమ్ వివరించాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడేటప్పుడు తనకు రూ. 7.5 కోట్లు వచ్చేదని, ఆ మొత్తాన్ని తాజా ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్ నుంచి పొందలేదని చెప్పాడు.
అంతేకాకదు తనను అదే మొత్తానికి గుజరాత్ లయన్స్ జట్టు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మెక్కల్లమ్ గుర్తు చేశాడు. ఆటగాళ్లకు ఇచ్చే వేతనాన్ని శాలరీ క్యాప్ పేరు చెప్పి తగ్గించి ఇచ్చారని మెక్కల్లమ్ అందులో స్పష్టం చేశాడు.
స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల స్ధానంలో 2016లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్లు ఐపీఎల్లోకి ప్రవేశించాయి.
ఈ క్రమంలో 2016లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో చెన్నై, రాజస్థాన్ జట్ల ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో మెక్కల్లమ్ను గుజరాత్ లయన్స్ వేలంలో దక్కించుకుంది. ఇదిలా ఉంటే మెక్కల్లమ్ ట్వీట్పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ త్వరలో కామెంట్రీ బాక్సులో కలుసుకుందామని ట్వీట్ చేశాడు.