భారతదేశంలో వరల్డ్ కప్ను ప్రజలు ఎంతగా ప్రేమిస్తారో ప్రపంచానికి చాటిచెప్పేలా టీమిండియా విజయోత్సవ ర్యాలీ కొనసాగుతోంది. గురువారం ఉదయం భారత గడ్డపై చేరిన క్షణం నుంచి రోహిత్సేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అభిమాన ఆటగాళ్లను, ప్రపంచకప్ చూడాలని భారత జట్టు ప్రయాణించిన ప్రతిచోట భారీగా తరలివస్తున్నారు.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్, టీమిండియా బస చేసిన హోటల్, ముంబై విమానశ్రయం... ఇలా అడుగడుగన నీరాజనం పడుతున్నారు. ఇక ముంబైలోని మెరైన్ రోడ్డులో జనసంద్రమే! టీమిండియా విజయోత్సవ ర్యాలీకి అభిమానులు భారీగా తరలివచ్చారు. నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్లన్నీ అభిమానులతో నిండిపోయింది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన రోడ్షో చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా సాగుతోంది.

13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేనను అభినందించడానికి అభిమానులు దేశం నలుమూల నుంచి ముంబైకి చేరుకున్నారు. మరోవైపపు టీమిండియా ఆటగాళ్ల వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే భారత ఆటగాళ్లను దగ్గరగా చూడాలని ఓ అభిమాని వినూత్నంగా రిస్క్ చేశాడు. ఏకంగా భారీ చెట్టు పైకెక్కి ఆటగాళ్లను పలకరించడానికి ప్రయత్నించాడు.
అంతేగాక ఓ చేతితో బ్యాలెన్స్ చేస్తూ మరో చేతితో ఫ్లాష్ లైట్ వేస్తూ టీమిండియాను వీడియో తీయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఎవడ్రా వీడు ఇంత టాలెండెడ్గా ఉన్నాడంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అతడి చేష్టలపై మండిపడుతున్నారు.