ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం మహా సమరం మొదలుకానుంది. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 2న మొదలుకానున్న ఈ మెగాటోర్నీ అదే నెల 29న ముగుస్తోంది. అయితే ఈ ప్రపంచకప్కు భారత జట్టును ప్రకటించడానికి మే 1వ తేదీనే ఆఖరి గడువు.
ఇప్పటికే అందరి కంటే ముందు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికా తమ జెర్సీని విడుదుల చేసింది. కానీ టీమిండియా ప్రకటన ఎప్పుడు అనే దానిపై స్పష్టత లేదు. ఇవాళ లేదా రేపు భారత జట్టును బీసీసీఐ వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రపంచకప్కు ఎంపికయ్యే భారత జట్టును ప్రకటిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా 15 మందితో కూడిన భారత జట్టును వెల్లడించాడు. తమ దేశంలోని పిచ్ పరిస్థితులకు సరిపోయే భారత ఆటగాళ్లను లారా ఎంపిక చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్గన్ మయాంక్ యాదవ్కు లారా అవకాశం ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో మయాంక్ అరంగేట్రం చేయనప్పటికీ, వేగంతో పాటు వైవిధ్యంగా బంతులు వేసే సామర్థ్యం ఉండటంతో సెలక్ట్ చేశాడు.
అయితే నయా ఫినిషర్గా పేరున్న రింకూ సింగ్కు అవకాశం ఇవ్వలేదు. మిడిల్-లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్య, శివమ్ దూబెకు అవకాశం ఇచ్చి రింకూకు లారా మొండిచేయి చూపించాడు. ఊహించినట్లుగానే వికెట్ కీపర్ స్థానాల్లో రిషభ్ పంత్తో పాటు సంజు శాంసన్ను సెలక్ట్ చేశాడు. అలాగే రోహిత్ శర్మకు జోడిగా యశస్వీ జైస్వాల్ను ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, సందీప్ శర్మను, స్పిన్నర్లుగా కుల్దీప్, చాహల్ను జట్టులోకి తీసుకువచ్చాడు.
టీ20 ప్రపంచకప్కు లారా ఎంపిక చేసిన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ, శివమ్ దూబె, యుజువేంద్ర చాహల్, మయాంక్ యాదవ్.