
మెల్బోర్న్: టెస్టు ఫార్మాట్లో టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని ఎంతో మంది మాజీలు ప్రశంసిస్తున్నారు. స్పిన్ మాయాజాలంతో అతడు భారత్కు ఎన్నోసార్లు విజయాలు అందించాడు. అయితే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ మాత్రం విభిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అశ్విన్ గొప్ప ఆఫ్ స్పిన్నర్ అని, అయితే సుదీర్ఘ ఫార్మాట్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ అత్యుత్తమని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.
ఆసీస్ తరఫున 123 వన్డేలు, 7 టెస్టులు ఆడిన బ్రాడ్ హాగ్.. ట్విటర్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శనివారం సమాధానమిచ్చాడు. అశ్విన్, లైయన్లో టెస్టు ఫార్మాట్లో ఎవరు బెస్ట్ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. 'ప్రస్తుతం ప్రపంచ బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ లైయన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గడిచిన ఏడాది వరకూ బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ రేసులో అశ్విన్ ముందు వరుసలో ఉండేవాడు. ఆ ప్లేస్ను అశ్విన్ నుంచి లైయన్ లాగేసుకున్నాడు. అయితే ఇద్దరూ గొప్ప స్పిన్నర్లే. తమ ఆటతీరుపై సంతృప్తి చెందకుండా బౌలింగ్లో మరింత మెరుగువ్వాలని ప్రయత్నిస్తుంటారు' అని తెలిపాడు.
లైయన్ అన్ని పరిస్థితుల్లో సత్తాచాటుతాడని, అశ్విన్ విదేశాల్లో గొప్పగా రాణించలేడని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. 71 టెస్టులు ఆడిన అశ్విన్ 365 వికెట్లు సాధించగా.. లైయన్ 96 టెస్టుల్లో 390 వికెట్లు పడగొట్టాడు. భారత క్రికెట్లో ఆఫ్ స్పిన్నర్గా తన మార్కును చూపెట్టిన అశ్విన్.. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఒకవైపు జట్టులో చోటు సంపాదించడమే కష్టంగా మారిన తరుణంలో ఆడపాదడపా వచ్చిన అవకాశాల్ని కూడా పెద్దగా వినియోగించుకోలేకపోతున్నాడు. 71 టెస్టుల్లో 365 టెస్టు వికెట్లు సాధించిన అశ్విన్.. పూర్వ వైభవం తగ్గిందనే చెప్పాలి.
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మానసికంగా దృఢంగా అవ్వాలని ఇటీవలే బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ఇందుకోసం పంత్ మైండ్ కోచ్ను సంప్రదించాలి, ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు మైండ్ కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంటారు అని హాగ్ పేర్కొన్నారు. ఎంతో అపారమైన ప్రతిభ పంత్ సొంతమని, క్రిజ్లోకి వచ్చినప్పుడు అతని బ్యాటింగ్ చూడడానికి ఖచ్చితంగా టీవీ ఆన్ చేస్తానని ఆసీస్ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చారు. పొట్టి ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేయగల సామర్థ్యం ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకి మాత్రమే ఉందన్న విషయం తెలిసిందే.