
హైదరాబాద్: అసలే వారాంతం.. ఆపైన రెండు క్రీడా సంరంభాలు ఒకేసారి వస్తుండటంతో జూలై 7 శుక్రవారం క్రీడా ఔత్సాహికులకు పండుగకానుంది. సునీల్ ఛెత్రి అభ్యర్థనతో ఇప్పటికే ఉత్తర భారతంలో అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉండటంతో వారికి సాయంత్రం 7:30 నుంచే పండుగ మొదలైనట్లే.
ఈ మ్యాచ్ను సోనీ టెన్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం ఇస్తుండటంతో.. ఉరుగ్వే, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియంల మ్యాచ్ ఫుట్బాల్ అభిమానులను కనువిందు చేయనుంది. కాస్త అటూఇటుగా రాత్రి 9గంటల సమయానికి ఫుట్బాల్ మ్యాచ్ పూర్తవుతుంది. తర్వాత ఒక గంట విరామంలో ఇంగ్లాండ్-భారత్ల మధ్య రెండో టీ20 మొదలుకానుంది.
ఇప్పటికే తొలి టీ20 చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టు రెండో టీ20 గెలవాల్సిందేనన్న కసితో తీవ్రమైన కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో పోటీలో ఉత్కంఠ నెలకొననుంది.
తొలి టీ20కి వేదికగా మాంచెస్టర్ను ఎంచుకోగా రెండో టీ20కి సోఫియా గార్డెన్స్లో కోహ్లీసేనను ఢీకొట్టనుంది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ కూడా ఫుట్బాల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సోనీ నెట్వర్క్ వారే ప్రసారం చేస్తుండటంతో ఛానెల్ మార్చే ప్రయత్నం కూడా చేయనవసర్లేదు.
క్రికెట్లో.. జట్ల పరంగా ఇంగ్లాండ్, ఇండియాలలో సమఉజ్జీలే ఉండటంతో.. మ్యాచ్ చివరి వరకూ ఒకే రకమైన పోటీ కనిపించనుంది. భారత్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఎంఎస్ ధోనీ, కేఎల్ రాహుల్లు టాప్, మిడిల్ ఆర్డర్లలో బలంగా కనిపిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్తో ఆడిన తొలి మ్యాచ్తోనే ముచ్చెమటలు పట్టించి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అలాగే ఇంగ్లాండ్ జట్టును చూస్తే.. జోస్ బట్లర్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి అద్భుతంగా రాణించి మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు.
జానీ బైర్స్టో, అలెక్స్ హేల్స్, కెప్టెన్ ఇయోన్ మోర్గాన్, జోయ్ రూట్లు మంచి బ్యాటింగ్ లైనప్తో కనిపిస్తున్నారు. ఫుట్బాల్ విషయానికొస్తే.. ఐదు సార్లు ఫిపా ఛాంపియన్ గా నిలిచిన బ్రెజిల్.. బెల్జియంను ఢీకొనబోతోంది. దీంతో సాయంత్రం 7:30కు మొదలైన మ్యాచ్లు రాత్రి 11:30 వరకూ క్రీడాభిమానులను అలరించనున్నాయి.