ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్ 2025) హాట్ టాపిక్ గా మారింది. ఈ లీగ్ లోని దర్బర్ రాజ్ షాహి ఫ్రాంఛైజీ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడా ఫ్రాంఛైజీ తమ జట్టు ప్లేయర్లకు, స్టాఫ్ మెంబర్స్ కు ఫీజ్ బకాయిలు చెల్లించలేక తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దీంతో ఆ జట్టులోని ఫారెన్స్ ప్లేయర్స్ తమ స్వదేశానికి తిరిగి వెళ్లలేక హోటల్ రూమ్స్ లోనే ఉండిపోయారట.
వాస్తవానికి రాజ్ షాహి ఓనర్ షాహిక్ రెహ్మాన్.. ఫారెన్ క్రికెటర్స్ తమ స్వదేశానికి వెళ్లడానికి రిటర్న్ టికెట్లు బుక్ చేసినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత డ్యూస్ క్లియరెన్స్ చేయడంలో సదరు ఫ్రాంఛైజీ విఫలమవ్వడం వల్ల, కొంతమంది ఫారెన్ క్రికెటర్లు ధాకాలోని టీమ్ హోటల్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మహ్మద్ హ్యారిస్ (పాకిస్థాన్) అఫ్తాబ్ అలామ్ (అప్ఘానిస్థాన్), మార్క్ డీయల్ (వెస్టిండీస్), రియాన్ బర్ల్ (జింబాబ్వే), మైగెల్ కమ్మిన్స్ (వెస్టిండీస్) సహా పలువురికి తమ డ్యూ పేమెంట్స్ అందకపోవడంతో హోటల్ రూమ్స్ లోనే ఉండిపోయారు.

బకాయిలు చెల్లింపులపై ఇప్పటికే విదేశీ ప్లేయర్లు.. టీమ్ మేనేజ్ మెంట్ తో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే జట్టులోని పలువురు లోకల్ క్రికెటర్లు తమ డ్యూ పేమెంట్ తీసుకోకుండానే హోటల్ రూమ్ ను చెక్ ఔట్ చేసి వెళ్లిపోయారట.
లాక్ చేసిన డ్రైవర్
రాజ్ షాహి ఫ్రాంఛైజీ.. కనీసం తమ ప్లేయర్లు ప్రయాణించే బస్ డ్రైవర్ మహ్మద్ బబుల్ కు జీతాన్ని ఇవ్వలేదట. దీంతో అసంతృప్తికి గురైన సదరు డ్రైవర్.. ప్లేయర్ల క్రికెట్ కిట్ బ్యాగ్స్ ను బస్సులోనే ఉంచి లాక్ వేసేశాడు. క్రికెటర్లు వాటిని తీసుకునేందుకు వీలు లేకుండా చేశాడు. ఫ్రాంఛైజీ తన తప్పును తెలుసుకునేందుకు ఇలా చెసినట్లు చెప్పిన డ్రైవర్.. డ్యూస్ చెల్లించేవరకు కిట్ బ్యాగ్ లను తిరిగి ఇవ్వనని పేర్కొన్నాడు.
"ఇది బాధకరమైన విషయం. అలానే సిగ్గు చేటు. ఫ్రాంఛైజీ మా పేమెంట్స్ ను క్లియర్ చేస్తే.. ఫారెన్, లోకల్ ప్లేయర్ల బ్యాగ్ కిట్స్ ను తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పటివరకు నేను మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను, బకాయిలు తీర్చకపోతే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది." అని బబుల్ వెల్లడించాడు. బీపీఎల్ 2025లో దర్బర్ రాజ్ షాహి జట్టు ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయింది. 12 మ్యాచుల్లో కేవలం ఆరు గెలిచి ఆదో స్థానంలో నిలిచింది.