
ముంబై: బాక్సింగ్ డే టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన ఎత్తులు, వ్యూహాలతో, కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గొప్పగా నడపించిన అజింక్య రహానేపై కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియాకు అద్భుత విజయం సాధించి పెట్టిన రహానేపై బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ఈ విజయం ప్రత్యేకమైనదని అన్నాడు. టీమిండియా, రహానేను కొనియాడుతూ దాదా ఓ ట్వీట్ చేశాడు.
'మెల్బోర్న్ మైదానంలో (ఎంసీజీ) విజయం ఎంతో ప్రత్యేకం. టీమిండియా అక్కడ ఆడటానికి ఎంతో ఇష్టపడుతుంది. అజింక్య రహానే గొప్ప ప్రదర్శన చేశాడు. మంచి వాళ్లు తొందరగా ముగిస్తారు. టీమిండియాకు శుభాకాంక్షలు. తర్వాతి రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించాలి' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద క్రికెట్ మైదానం అయిన ఎంసీజీలో టీమిండియాకు ఇది నాలుగో విజయం. విదేశాల్లో ఆడిన టెస్టుల్లో టీమిండియాకు అత్యంత విజయవంతమైన వేదిక ఇదే.
రెండో టెస్టులో జట్టును గొప్పగా నడిపించిన తాత్కాలిక సారథి అజింక్య రహానేను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ప్రశంసిచడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ తెలిపారు. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్, మైక్ హస్సీ, షేన్ వార్న్ సహా మరికొందరు రహానే కెప్టెన్సీని కొనియాడారన్నారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజులు టీమిండియా గొప్పగానే ఆడిందని, కానీ మూడో రోజు ఆటలో ఒక గంట తడబాటుతో ఓటమిపాలైందన్నారు. ఇక బాక్సింగ్ డే టెస్టులో బౌలర్ల సమిష్టి కృషితోనే భారత్ గొప్పగా పుంజుకుందన్నారు.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలిన చేదు జ్ఞాపకం.. ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,మొహ్మద్ షమీ లాంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీ.. ఉమేశ్ యాదవ్ మ్యాచ్ మధ్యలోనే దూరమవ్వడం వంటి ప్రతికూలతల మధ్య టీమిండియా రెండో టెస్టులో గొప్పగా పోరాడింది. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ అజింక్య రహానే శతకంతో సత్తాచాటాడు. బౌలర్లు సమష్టి ప్రదర్శన చేశారు. నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. సిడ్నీ వేదికగా జనవరి 7న మూడో టెస్టు ప్రారంభం కానుంది.