రెండు టెస్టుల్లోనూ విఫలం
రెండు టెస్టుల్లోనూ మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయ్యారు. మురళీ విజయ్(49), కేఎల్ రాహుల్(48) నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి చేసిన స్కోర్లు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లోని 44 పరుగులు మినహాయిస్తే రాహుల్ చేసినవి నాలుగు పరుగులే కావడం విశేషం. వీరి ఆటతీరుపై విమర్శలు రావడంతో మూడో టెస్టు నుంచి తప్పించారు.
మూడో టెస్టుకు మూడు మార్పులు
మూడో టెస్టుకు జట్టు మేనేజ్మెంట్ మొత్తం మూడు మార్పులు చేసింది. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్లను టీమ్లో నుంచి తొలగించింది. మరోవైపు పేస్ర్ ఉమేష్ యాదవ్ను కూడా తప్పించారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నారు.
తొలి టెస్ట్ ఆడబోతున్న మయాంక్ అగర్వాల్
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్కు చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్ తన తొలి టెస్ట్ ఆడబోతున్నాడు. మూడో టెస్టుకు తుది జట్టుని ఎంపిక తీరును చూస్తుంటే... మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలతో ఓపెనింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించి భారీ ప్రయోగానికి జట్టు మేనేజ్మెంట్ తెరలేపనున్నట్లు తెలుస్తోంది.
|
ఆసీస్ పిచ్లపై ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా
ఆస్ట్రేలియా పిచ్లపై అనుభవజ్ఞులే తడబడుతున్న నేపథ్యంలో.. టెస్టుల్లో ఇంకా అరంగేట్రమే చేయని మయాంక్ అగర్వాల్ను ఇక్కడ ఆడించడం ఎలాంటి ఫలితాన్నిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి. ఆసీస్ పిచ్లపై కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా మయాంక్ అగర్వాల్ను నేరుగా దించడం అంత మంచిది కాదని మాజీలు వాదిస్తున్నారు.
మయాంక్ ఏ మేరకు రాణిస్తాడో!
మరోవైపు 2017-18 రంజీ సీజన్లో సెంచీరీల మీద సెంచరీలు బాదిన మయాంక్ ప్రస్తుతం అంత గొప్ప ఫామ్లో కూడా లేడని అంటున్నారు. గత పది ఇన్నింగ్స్ల్లో అంతడు రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అక్టోబరులో స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్లో ఆడించి ఉంటే తనపై ఒత్తిడి లేకుండా ఉండేదని అంటున్నారు. ఇలాంటి సమయంలో మయాంక్ ఏమేరకు రాణిస్తాడో చూడాలి మరి.