
మెల్బోర్న్: ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా శనివారం ప్రారంభం అయిన బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు రాణిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాయాజాలం చూపిస్తున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ టాప్ ఆర్డర్ను బెంబేలెత్తించాడు. మొదటగా ఓపెనర్ మాథ్యూ వెడ్ (30)ను, ఆ తర్వాత స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ (0) ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు మాథ్యూ వెడ్, జో బర్న్స్ ఆరంభించారు. ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ఓపెనర్లను పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. ఐదవ ఓవర్ రెండో బంతికి బుమ్రా.. బర్న్స్ (0)ను ఔట్ చేశాడు. 10 బంతులు ఆడిన బర్న్స్.. కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బుమ్రా వరుసగా సంధించిన గుడ్ లెంగ్త్ బంతుల్ని వదిలేస్తూ వచ్చిన బర్న్స్.. ఓ బంతిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి పంత్ చేతుల్లో పడింది. ఆపై మార్కస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు.
ఈ సమయంలో వెడ్ కాస్త వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. 11వ ఓవర్లోనే కెప్టెన్ అజింక్య రహానే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేతికి బంతినిచ్చాడు. 13వ ఓవర్ ఐదవ బంతికి వెడ్ క్యాచ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజా అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. అశ్విన్ మాయాజాలానికి మరోసారి చిక్కాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ చేతికి చిక్కిన స్మిత్.. మళ్లీ అదే పునరావృతం చేశాడు. 15వ ఓవర్ మూడో బంతికి పుజారా క్యాచ్ పట్టడంతో స్మిత్ ఇన్నింగ్స్ ముగిసింది.
అశ్విన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ టాప్ ఆర్డర్ను బెంబేలెత్తించాడు. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో పడింది. అయితే మార్కస్ లబుషేన్ మాత్రం వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేస్తున్నాడు. అతనికి ట్రావిస్ హెడ్ సహకారం అందిస్తున్నాడు. జడేజా కూడా రంగంలోకి దిగాడు. ఆసీస్ లంచ్ సమయాని 27 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 65 రన్స్ చేసింది క్రీజులో లబుషేన్ (26), హెడ్ (4) పరుగులతో ఉన్నారు. మొత్తానికి మొదటి సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించింది.