పటిష్ఠ స్థితిలోనే ఇంగ్లండ్
376 పరుగుల ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ శనివారం ఆట ముగిసే సమయానికి 121/1 స్కోరుతో పటిష్ఠ స్థితిలోనే నిలిచింది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉండడంతో ఇంగ్లీష్ జట్టు విజయంపై కన్నేసినట్టే కనిపించింది. కానీ ఆదివారం నాలుగో రోజు ఆటలో పేసర్లు రబాడ (4/103), ఎన్రిచ్ నోర్టే (3/56) కట్టుదిట్టమైన బంతులకు ఇంగ్లండ్ 93 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది.
రబాడ విజృంభణ
ఓవర్నైట్ స్కోరు 121/1తో ఆదివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్.. కాసేపటికే బర్న్స్ (154 బంతుల్లో 84; 11 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. అయినా డెన్లీ (31), రూట్ (48) నిలకడగా ఆడటంతో ఇంగ్లండ్ గెలుపు ఖాయమే అనిపించింది. ఈ సమయంలో రబడ, నోర్జే రెచ్చిపోవడంతో 64 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
టెస్టు చాంపియన్షిప్లో బోణీ
డికాక్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్టౌన్లో ప్రారంభం కానుంది. తాజా విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో డుప్లెసిస్ సేన ఖాతా తెరిచింది. ఈ గెలుపు అనంతరం దక్షిణాఫ్రికాకు 30 పాయింట్లు లభించాయి. టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మొదటి పోరులోనే విజయం
దక్షిణాఫ్రికా జట్టు గత కొంతకాలంగా సంధి దశలో ఉన్న విషయం తెలిసిందే. దిగ్గజ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్, జాక్వస్ కలిస్ టీమ్ డైరెక్టర్, కోచ్, సలహాదారుల పాత్రలోకి వచ్చిన తర్వాత బరిలోకి దిగిన మొదటి పోరులోనే ఆ జట్టు విజయాన్ని అందుకుంది. ఈ విజయాలను దక్షిణాఫ్రికా కొనసాగిస్తుందో లేదో చూడాలి.