బాక్సింగ్ డే..
క్రిస్మస్ తర్వాతి రోజును ఇలా పిలుస్తుంటారు. క్రికెట్లో దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఇండియాలో దీని ప్రభావం తక్కువే గానీ, దక్షిణార్ధగోళంలో ఉండే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా దేశాల్లో బాక్సింగ్ డే నాడు జరిగే మ్యాచ్లకు చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఇదే నేపథ్యంతో తాజాగా అటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ నాలుగో టెస్ట్ మొదలైంది. డిసెంబరు 26 సాయంత్రం దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య మరో బాక్సింగ్ డే టెస్ట్ మొదలు కాబోతుంది. ఈ మ్యాచ్కు మరో ప్రాధాన్యత కూడా ఉన్నది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి నాలుగు రోజుల పాటు జరిగే మ్యాచ్ ఇది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం బాక్సింగ్ డే సందర్భంగా వన్డేలు లేదా టీ20లు నిర్వహిస్తుంది. డిసెంబరు 26 వెస్టిండీస్తో కివీస్ వన్డే మ్యాచ్ ఆడనుంది. అంతేకాదు ఈ బాక్సింగ్ డే మ్యాచ్లకు సాంప్రదాయ వేదికలు కూడా ఉన్నాయి.
భారీ సంఖ్యలో ప్రేక్షకులు ..
ఆస్ట్రేలియాలో అయితే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, దక్షిణాఫ్రికాలో అయితే డర్బన్లోని కింగ్స్మీడ్ స్టేడియం, న్యూజిలాండ్లో వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ ఈ బాక్సింగ్ డే మ్యాచ్లను నిర్వహిస్తాయి. వీటికి ఆదరణ కూడా చాలా ఎక్కువే. అసలు టెస్ట్లు ఎవరు చూస్తారులే అనుకునే ఈ రోజుల్లో బాక్సింగ్ డే రోజు మొదలయ్యే మ్యాచ్ను భారీ సంఖ్యలో ప్రేక్షకులు చూస్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్కు సుమారు 90 వేల మంది వరకు వచ్చారంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
తొలి వీక్ డేగా బాక్సింగ్ డే..
ఇవాళ కూడా సెలవు రోజే. క్రిస్మస్ తర్వాతి రోజును బాక్సింగ్ డేగా జరుపుకుంటారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం క్రిస్మస్ తర్వాత వచ్చే తొలి వీక్ డేగా బాక్సింగ్ డేను వర్ణిస్తారు. మొట్ట మొదటగా 1950లో తొలి బాక్సింగ్ డే టెస్ట్ జరిగింది. డిసెంబర్ 22న ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఆ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అయితే 1950 నుంచి 1980 మధ్య కేవలం నాలుగు బాక్సింగ్ డే టెస్ట్లే జరిగాయి. 1975లో వెస్టిండీస్తో ఆస్ట్రేలియా ఆడిన బాక్సింగ్ డే టెస్ట్కు రికార్డు స్థాయిలో 86 వేల మంది ప్రేక్షకులు రావడంతో ఈ టెస్ట్ ప్రాధాన్యం పెరిగిపోయింది.
70 శాతం మ్యాచ్లను ఆస్ట్రేలియానే
1990ల నుంచి బాక్సింగ్ డే టెస్ట్ ఆస్ట్రేలియా క్రికెట్లో భాగమైపోయింది. 2013లో యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్కు 91,112 మంది ప్రేక్షకులు వచ్చారు. ఇది రికార్డు. ఇదే మ్యాచ్ మొత్తం ఐదు రోజుల్లోనూ కలిపి 2,71,865 మంది ప్రత్యక్షంగా చూశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికం. ఈ బాక్సింగ్ డే టెస్టుల్లో 70 శాతం మ్యాచ్లను ఆస్ట్రేలియా గెలవడం విశేషం.

సెహ్వాగ్ చేసిన 195 పరుగులు..
1985 నుంచి ఇప్పటివరకు భారత్ ఏడు బాక్సింగ్ డే టెస్టులు ఆడింది. అందులో రెండు మ్యాచులు డ్రాగా ముగియగా.. మిగతా ఐదింట్లోనూ ఆస్ట్రేలియానే గెలిచింది. 2003-04 టూర్లో భాగంగా ఇదే బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజే సెహ్వాగ్ చేసిన 195 పరుగులు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాయి. అయితే ఆ మ్యాచ్లో తర్వాత పుంజుకున్న ఆస్ట్రేలియా విజయం సాధించింది.

కపిల్దేవ్ చెలరేగడంతో
బాక్సింగ్ డే టెస్ట్ కాకపోయినా.. ఇదే మెల్బోర్న్ గ్రౌండ్లో 1981లో ఇండియా చిరస్మరణీయ విజయం సాధించింది. కపిల్దేవ్ చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 59 పరుగులతో గెలిచి చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications











