
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్డే టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకు ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియాను మరోసారి కట్టడి చేసింది. సోమవారం మూడో రోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా 133/6తో నిలిచింది. దీంతో భారత్ కన్నా 2 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాదించింది. ప్రస్తుతం కామరూన్ గ్రీన్ (17), పాట్ కమిన్స్ (15) క్రీజులో ఉన్నారు. మంగళవారం ఉదయం ఆస్ట్రేలియా టెయిలెండర్లను భారత బౌలర్లు ఎంత త్వరగా ఔట్ చేస్తారనే విషయంపైనే విజయం ఆధారపడింది.
అయితే మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వికెట్ పడగొట్టిన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ హద్దులు మీరి సంబరాలు చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 107వ ఓవర్ వేసిన స్టార్క్.. భారీ వేగంతో షార్ట్ పిచ్ బంతిని సందించాడు. ఆ బంతిని జడేజా డీప్ మిడ్ వికెట్ దిశగా ఫుల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే షాట్ సరైన విధంగా కనెక్ట్ కాకపోవడంతో.. డీప్ మిడ్ వికెట్ దిశగా బంతి గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మరో పేసర్ పాట్ కమిన్స్ బంతిని అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.
వికెట్ తీసిన ఆనందంలో మిచెల్ స్టార్క్ హద్దులు మీరి సంబరాలు చేసుకున్నాడు. రవీంద్ర జడేజా వైపు చూస్తూ గట్టిగా అరిచి సంబరాలు చేసుకున్నాడు. అంతేధీటుగా జడేజా మైదానంలోనే బదులిస్తూ కనిపించాడు. దాంతో స్టార్క్ వెనక్కి తగ్గాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ మ్యాచ్లో అజింక్య రహానేతో కలిసి జడేజా ఆరో వికెట్కి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దేంతో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 326 పరుగులు చేసింది. మరోవైపు స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా కీలక సమయంలో హాఫ్ సెంచరీ (57) చేశాడు. కెప్టెన్ అజింక్య రహానేకు తోడుగా నిలిచి మంచి పరుగులు జోడించిన జడేజాపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు. టెస్టుల్లో తానెప్పుడూ జడేజాకు వీరాభిమానినని, చాలా ఏళ్లుగా తన అభిప్రాయం అలాగే ఉందన్నాడు. జడేజాకు టెస్ట్ ఫార్మాట్ సరిగ్గా సరిపోతుందని సంజయ్ తెలిపాడు.