
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ల మైండ్ గేమ్ గురించి తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే పేర్కొన్నాడు. తమ జట్టు కూర్పు, ప్రణాళికలపై ఎక్కువ దృష్టిసారించామని తెలిపాడు. స్వదేశానికి వెళ్లేముందు విరాట్ కోహ్లీ జట్టు సభ్యులతో కాసేపు మాట్లాడి స్ఫూర్తి నింపాడని జింక్స్ చెప్పాడు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు రహానే మీడియా సమావేశంలో పాల్గొని పలు విషయాలపై చర్చించాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను రహానే అందుకున్నాడు. మిగతా మూడు టెస్టులకు జింక్స్ సారథ్యం వహిస్తాడు.
'ఆస్ట్రేలియా వాళ్లు చాలా బాగా మైండ్గేమ్లు ఆడతారు. వాళ్లు అలాగే ఆడనివ్వండి. మేమైతే మా జట్టుపై దృష్టిపెట్టాం. ఒక బృందంగా మమ్మల్ని మేం ప్రోత్సహించుకోవాల్సిన సమయమిది. టీమిండియాను ముందుకు నడిపించడం నేను గర్వపడే విషయం. ఇదొక గొప్ప అవకాశం. గొప్ప బాధ్యత. అయితే నేనెలాంటి ఒత్తిడికి గురికాను. నేను చేయాల్సింది నా జట్టుకు అండగా ఉండడం. విరాట్ కోహ్లీ వెళ్లేముందు మాతో మాట్లాడాడు. అడిలైడ్లో జట్టంతా కలిసి డిన్నర్ చేశాం. పరిస్థితులను బట్టి ఆడాలని, ఒకర్నొకరు ప్రోత్సహించుకుంటూ సమయం ఆస్వాదించాలని సూచించాడు. అప్పుడే విజయం లభిస్తుందని మాకు చెప్పాడు. ఆ దిశగా వెళతాం' అని రహానే తెలిపాడు.
'అడిలైడ్లో తొలి రెండు రోజులు బాగా ఆడాం. మూడో రోజు ఒక్క గంటలోనే అంతా అయిపొయింది. అది గతం. ఇక రెండో టెస్టుపై దృష్టిపెట్టాం. మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్కు స్వేచ్ఛను ఇస్తున్నాం. ఆసీస్లోనే కాదు ఎక్కడైనా ఓపెనింగ్ కష్టమే. ఓపెనర్లు కుదురుగా ఆడి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పితే.. తర్వాత వచ్చే బ్యాట్స్మెన్కు సులభమవుతుంది. జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ సిరాజ్ మా పేసర్లు. సిరాజ్ సైతం మిగతా వాళ్లతో సమానమైన ప్రతిభావంతుడు' అని జింక్స్ పేర్కొన్నాడు.
'ఎంసీజీ విషయానికి వస్తే.. మైదానంలో కాలక్రమేణా మార్పులు వస్తున్నాయి. 2018లో పిచ్ కాస్త భిన్నంగా ఉంది. 2014లో ఇది మంచి వికెట్. వికెట్ను త్వరగా అర్థం చేసుకొని మేం ఆడాల్సి ఉంటుంది' అని అజింక్య రహానే చెప్పుకొచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్పైన్ మాట్లాడుతూ... 'అడిలైడ్లో చేతులెత్తేసినట్లు భారత్ మెల్బోర్న్లో తలవంచదు. క్రికెట్ను ప్రతిష్ఠాత్మకంగా భావించే భారత్ రెండో టెస్టులో అంత తేలిగ్గా లొంగదు. రిషభ్ పంత్ లాంటి ఆటగాళ్లతో మాకు ప్రమాదం పొంచి ఉంది' అని అన్నాడు.