డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కాస్త ఆలస్యమైనా టీ20 వరల్డ్ కప్లో ఘనంగా బోణీ కొట్టింది. సూపర్-8కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన తరుణంలో రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించింది. కేవలం 3.1 ఓవర్లలోనే ఒమన్పై విజయం సాధించి గణనీయంగా నెట్రన్రేటును మెరుగుపర్చుకుంది. -1.800 నుంచి +3.081కు చేరుకుని నెట్రన్రేట్లో స్కాట్లాండ్ను అధిగమించి రేసులో ముందడుగు వేసింది.
ఆంటిగ్వా వేదికగా శుక్రవారం ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌటైంది. అదిల్ రషీన్ (4/11) నాలుగు వికెట్లతో, మార్క్ వుడ్ (3/12), జోఫ్రా ఆర్చర్ (3/12) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. ఒమన్ బ్యాటర్లలో షోయబ్ ఖాన్ (11; 23 బంతుల్లో, 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నాడు.

అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ బట్లర్ (24 నాటౌట్; 8 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 101 బంతులు మిగిలుండగానే గెలిచిన ఇంగ్లండ్.. టీ20 వరల్డ్ కప్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ఛేదన చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. కాగా, మ్యాచ్ అనంతరం తమ రికార్డు విజయం గురించి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడాడు. బౌలర్ల గొప్ప ప్రదర్శన వల్లే ఈ ఘనత సాధించామని అన్నాడు. నెట్రన్రేటు మెరుగుపర్చుకోవాలనే దూకుడుగా బ్యాటింగ్ చేసే క్రమంలో రికార్డు అందుకున్నామని అన్నాడు.
''బౌలర్లు అదరగొట్టారు. ఆదిలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడిచేశారు. వికెట్పై కాస్త ఎక్సట్రా బౌన్స్ లభించింది. చక్కని లైన్ అండ్ లెంగ్త్తో అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్ గొప్పగా అనుకూలిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇది ఎంతో మంచి వికెట్. మేం మెరుగైన నెట్రన్రేటు కోసమే ప్రయత్నిస్తూ పాజిటివ్గా బ్యాటింగ్ చేశాం. ఇక స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి ఆలోచించట్లేదు. మా ఆట గురించి మాత్రమే దృష్టి సారిస్తున్నాం.నమీబియాపై ఘన విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం'' అని బట్లర్ అన్నాడు. ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ విజయం సాధిస్తే ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.