సిడ్నీ: ఈ ఏడాది చివర్లో టీమిండియాతో జరుగనున్న టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా పేసర్లపై ఎక్కువ భారం పడనుందని ఆ జట్టు మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. సొంతగడ్డపై ఆడటం కంగారూలకు కలిసొచ్చే అంశమే అయినా.. బౌలర్లు సత్తా చాటకుంటే కష్టమని పేర్కొన్నాడు. కోకాబుర్రా బంతితో సహజంగా ఎక్కువ స్వింగ్ రాదని, సెలైవా (ఉమ్మి) నిషేధం వల్ల వాటిపై ప్రభావం ఎక్కువగా ఉండదని లీ అభిప్రాయపడ్డాడు.
మంగళవారం పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బ్రెట్ లీ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా పటిష్ట జట్టుతో వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంతగడ్డ పరిస్థితులు కంగారూలకు కాస్త అనుకూలించినా.. పేసర్తు ప్రభావం చూపకుంటే మాత్రం కష్టం. టీమిండియాలో టాప్ క్లాస్ బ్యాట్స్మన్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, అంజిక్య రహానేలను పరుగులు చేయకుండా ఆపడం కష్టమవుతుంది' అని అన్నాడు.
'ఆస్ట్రేలియాలానే భారత్ వద్ద కూడా బలమైన పేస్ బౌలింగ్ దళం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీళ్లు మంచి ఫామ్లో ఉన్నారు. బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించిన తరుణంలో విభిన్న పరిస్థితుల్లో బంతి ఎలా స్వింగ్ అవుతుందో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సెలైవా బ్యాన్ వల్ల కోకాబుర్రా బాల్స్ స్వింగ్లో ఎక్కువగా మార్పు రాదు. దీని వల్ల రివర్స్ స్వింగ్ కూడా పెద్దగా ఉండదు. దాంతో సెలైవా రుద్దినా.. రుద్దకపోయినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు' అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. టిమ్ పైన్ అద్భుతమైన నాయకత్వం వహిస్తున్నాడని, కెప్టెన్సీ అతడు సరైనోడు అని 43 ఏళ్ల లీ చెప్పాడు.
ఎన్నో ఏళ్ల నిరీక్షణను తెరదించుతూ ఏడాదిన్నర కిందట ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ అందుకుంది విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు. 1947 నుంచి భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నా 2018 వరకు ఒక్క టెస్టు సిరీస్లో కూడా విజయం సాధించలేదు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఘనత సాధించి 71 ఏళ్ల కలను నెరవేర్చడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
అప్పటి సిరీస్లో ఛటేశ్వర్ పుజారా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొందడంతో సిరిస్ 1-1తో సమం అయింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 137 పరుగులతో విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుకు పలు మార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను కోహ్లీసేన 2-1 తేడాతో దక్కించుకుంది.