
హైదరాబాద్: మహిళల వన్డే మ్యాచ్లో అద్భుతం చోటు చేసుకుంది. విదర్భ జట్టు మీడియం పేసర్ కోమల్ జన్జాద్ ఓ మ్యాచ్లో ఎనిమిది పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు తీసి సరికొత్త రికార్డుని సృష్టించింది. గురువారం విదర్భ-హర్యానా జట్ల మధ్య జరిగిన బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఈ రికార్డు నెలకొంది.
విదర్భ-హర్యానా మ్యాచ్ స్కోరు కార్డు
కోల్కతా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో 26 ఏళ్ల మీడియం పేసర్ కోమల్ బౌలింగ్ ధాటికి హర్యానా 18.4 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌటైంది. కోమల్ దెబ్బకు హర్యానా బ్యాట్స్విమెన్ పెవిలియన్కు క్యూకట్టారు. 9.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు ఓవర్లను మెయిడిన్ చేసిన కోమల్ తొలి వికెట్ మినహా మిగతా తొమ్మిది వికెట్లను ఖాతాలో వేసుకుంది.
హర్యానా జట్టు కెప్టెన్ ఎస్ఎం ఖత్రి చేసిన ఏడు పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఐదుగురు సున్నా పరుగులకే ఔటయ్యారు. అనంతరం 32 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు కేవలం 4.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయాన్ని సాధించి సెమీస్కు దూసుకెళ్లింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.