సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు.
మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. దీంతో సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే ప్రాక్టీస్లో భారత ఆటగాళ్లకు వరుసగా గాయాలవుతున్నాయి. సిరీస్ ఆరంభం కాకముందే ఏకంగా ముగ్గురు స్టార్ ప్లేయర్లు గాయపడ్డారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలకు గురువారం గాయాలైన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో శుభ్మన్ గిల్ కూడా చేరాడు.

శుభ్మన్ గిల్ బొటనవేలు ఫ్రాక్చర్ అయ్యింది. స్లిప్లో క్యాచ్ పడుతుండగా గాయపడ్డాడు. స్కానింగ్ అనంతరం గిల్కు తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు అతను దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ''మ్యాచ్ సిమ్యులేషన్లో ఫీల్డింగ్ చేస్తుండగా శుభ్మన్ గిల్ బొటనవేలుకు గాయమైంది. వైద్యసిబ్బంది సూచనల మేరకు స్కానింగ్ చేయగా బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్లు తెలిసింది. తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం దాదాపు కష్టమే. రెండో టెస్టు ప్రారంభ సమయానికి మాత్రం పూర్తిగా కోలుకోగలడు'' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతకుముందు కేఎల్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రసిధ్ కృష్ణ వేసిన బంతికి రాహుల్ మోచేతికి గాయమైంది. నొప్పి తీవ్రత, సుదీర్ఘ సిరీస్ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకొని కేఎల్ రాహుల్ మైదానాన్ని వీడాడు. మరోవైపు విరాట్ కోహ్లికి కూడా గాయమైందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. అంతేగాక మిస్టరీ గాయం కోసం కోహ్లి స్కానింగ్కు కూడా వెళ్లాడని రాసుకొచ్చింది. అయితే కోహ్లి బాగున్నాడని, అతని విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, వ్యక్తిగత కారణాలతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు దూరమవుతున్నాడని ప్రచారం సాగుతున్న వేళ కీలక ఆటగాళ్లు గాయాలపాలవ్వం టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ బదులుగా గిల్ను ఓపెనర్గా పంపాలని సూచనలు వస్తున్న వేళ.. గిల్కు గాయమవ్వడం గమనార్హం. అయితే గురువారమే రితికా పండంటి మగబిడ్డక జన్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశమూ ఉంది.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).