సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు.
మరోవైపు ఆస్ట్రేలియాకు కూడా ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. దీంతో సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే గత రెండు ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విజయఢంకా మోగించినప్పటికీ, ప్రస్తుతం ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందుకోవాలంటే భారత్ తీవ్రంగా శ్రమించాల్సిందే. టాస్, తుది జట్టు ఎంపిక నుంచి ఫీల్డింగ్ మోహరింపు వరకు పదునైన వ్యూహాలతో బరిలోకి దిగాల్సి ఉంది.

అయితే ఈ క్రమంలో టీమిండియా మేనేజ్మెంట్కు తుదిజట్టు ఎంపిక గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. కోచ్గా ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ఓడించిన అనుభవం రవిశాస్త్రికి ఉంది. అయితే ఈ ప్రముఖ వ్యాఖ్యాత.. రోహిత్ గైర్హాజరీ అయితే భారత తుదిజట్టు ఎంపిక ఎలా ఉండాలో వివరించాడు. ఆస్ట్రేలియాలో ఇండియా-ఏ తరఫున అభిమన్యు ఈశ్వరన్ నిరాశపరిచాడని, రోహిత్ గైర్హాజరీలో ఈ యువ ప్లేయర్ను ఓపెనర్గా పంపవద్దని చెప్పాడు. గత పర్యటనలో ఓపెనర్గా అనుభవం ఉన్న శుభ్మన్ గిల్ను యశస్వీ జైస్వాల్కు తోడుగా బరిలోకి దించాలని సూచించాడు.
కేఎల్ రాహుల్ను వన్డౌన్లో పంపాలని రవిశాస్త్రి తెలిపాడు. ఫామ్, పరుగులను లెక్కలోకి తీసుకోకుండా కాళ్ల కదలికలు, టెక్నిక్ ఆధారంగా మూడో స్థానంలో రాహుల్కు అవకాశం ఇవ్వాలని అన్నాడు. ఆ తర్వాతి బ్యాటింగ్ ఆర్డర్లో విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ను వరుసగా పంపించాలని పేర్కొన్నాడు. ఇండియా-ఏ తరఫున అదరగొట్టిన ధ్రువ్ జురెల్ను స్పెషలిస్ట్ బ్యాటర్గా తుదిజట్టులో సెలక్ట్ చేయాలని వెల్లడించాడు. కేవలం ఒక్క స్పిన్నర్ను మాత్రమే తీసుకోవాలని, అలాగే పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్-11లో అవకాశం ఇవ్వాలని సూచించాడు.
రవీంద్ర జడేజా లేదా వాషింగ్టన్ సుందర్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని రవిశాస్త్రి అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్లతో పాటు నితీశ్ రెడ్డి పేస్ బాధ్యతల పంచుకుంటాడని తెలిపాడు. నితీశ్ మంచి స్పెల్స్తో పాటు బ్యాటింగ్ చేయగలడని, గత పర్యటలో శార్దూల్ ఠాకూర్ పోషించిన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించగలడని శాస్త్రి తెలిపాడు.
రవిశాస్త్రి సూచించిన భారత తుది జట్టు: శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.