సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
ఈ సిరీస్ను కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే ఈసారి కంగారూల గడ్డపై జరగనున్నబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి సగటు అభిమానుల్లో కొన్ని ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ల్లో దేశాల పేర్లతో పాటు స్పాన్సర్ కంపెనీని జతచేసి సిరీస్కు నామకరణం చేస్తారు. కానీ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఎందుకు పిలుస్తున్నారనే ప్రశ్న కొంతమందిలో కలుగుతుంది. అలా ఎందుకు పిలుస్తారంటే.. 1996లో భారత పర్యటనలో ఏకైక టెస్టు కోసం ఆస్ట్రేలియా వచ్చింది. అయితే ఆ సమయంలో టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, అలెన్ బోర్డర్ల గౌరవార్థం సిరీస్ నిర్వహిద్దామని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు భావించాయి.
అనంతరం ఆ ఒక్క టెస్టుతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇరు దేశాల బోర్డులు ప్రారంభించాయి. ఇప్పటివరకు 16 సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది. అందులో పది సార్లు భారత్దే విజయం. మిగిలిన ఆరింట్లో ఆస్ట్రేలియా 5 సార్లు గెలిచింది, ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ ట్రోఫీని 2016/17 నుంచి టీమిండియానే గెలుస్తుంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ మనదే పైచేయి.
క్రికెట్ అభిమానులను కలచివేసే మరో ప్రశ్న.. ఆస్ట్రేలియా-భారత్ టైమింగ్ భిన్నంగా ఉంటాయి. దీంతో ఏ టెస్టు ఎప్పుడు ప్రారంభమవుతుందని. అయితే తొలి టెస్టు ఆట భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.50 గంటలకు ముగుస్తుంది. ఇక రెండో టెస్టు డే/నైట్. ఇది భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 మొదలవుతుంది. మూడో టెస్టు ఉదయం 5.50 కి, చివరి రెండు టెస్టులు ఉదయం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.50)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు)
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.
తొలి టెస్టుకు ఎంపికైన ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.