సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. అయితే సిరీస్ ప్రారంభంకాక ముందే టీమిండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండో సారి తండ్రి అయిన కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా జరిగే టెస్టుకు దూరం కానున్నాడు. మరికొన్ని రోజులు కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు.

అయితే రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ కూడా పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. మ్యాచ్ సిమ్యులేషన్లో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటనవేలుకు గాయమైంది. స్కానింగ్లో ఫ్రాక్చర్ అయినట్లుగా తెలిసిందని సమాచారం. టాప్ ఆర్డర్లో రోహిత్, గిల్ లేకపోవడం టీమిండియాకు కోలుకోలేని ఎదురుదెబ్బే. బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కంగారూల గడ్డపై తేలిపోవడం భారత జట్టును మరింత కలవరపెడుతోంది.
ఈ నేపథ్యంలో మరో బ్యాటర్ను తొలి టెస్టుకు ఎంపికచేయాలని బీసీసీఐ భావిస్తోంది. దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్లలో ఒకరిని జట్టులోకి తీసుకొవాలని చూస్తోంది. భారత్-ఏ జట్టు తరఫున పడిక్కల్ ఫర్వాలేదనిపించాడు. అంతేగాక మ్యాచ్ సిమ్యులేషన్లో జస్ప్రీత్ బుమ్రాను సైతం పడిక్కల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ సిమ్యులేషనల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. అశ్విన్ బౌలింగ్లో రెండు సిక్సర్లతో సహా నాలుగు సిక్సర్లు బాదాడు.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు)
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.