భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుని 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో భారత జట్టు ఆధిక్యాన్ని 1-1తో సమం చేసింది.
ఆటతో పాటు ఆటగాళ్ల మధ్య గొడవలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మరింత రసవత్తరంగా మార్చింది. తొలి టెస్టులో హర్షిత్ రాణా X మిచెల్ స్టార్క్; యశస్వీ జైస్వాల్ X మిచెల్ స్టార్క్ మధ్య కవ్వింపులు సాగాయి. ఇక రెండో టెస్టులో ట్రావిస్ హెడ్ X మహ్మద్ సిరాజ్ మధ్య హైవోల్టేజ్తో జరిగిన వాగ్వాదం ఐసీసీ చర్యలు తీసుకునేంత స్థాయి వరకు వెళ్లింది. సాధారణంగా బలమైన జట్లు భారత్ X ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే హోరాహోరీగా సాగుతోంది. దీనికి తోడుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు కీలకంగా మారడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ నేపథ్యంలో మరో 15 రోజుల తర్వాత ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మూడో టెస్టు మొదలుకాకముందే నాలుగో టెస్టుకు భారీ డిమాండ్ నెలకొంది. తొలి రోజుకు సంబంధించి అందుబాటులో ఉన్న పబ్లిక్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మెల్బోర్న్ స్టేడియం కెపాసిటీ దాదాపు లక్ష మందికి ఉంటుంది. కాగా, అడిలైడ్ పింక్ బాల్ టెస్టుకు మూడు రోజుల్లో 1,35,012 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ క్రమంలో 2014-15లో అయిదు రోజులు పాటు సాగిన అడిలైడ్ టెస్టుకు హాజరైన గరిష్ట ప్రేక్షకుల సంఖ్య 113,009 రికార్డు బ్రేక్ అయ్యింది.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ - భారత్ విజయం
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ - ఆస్ట్రేలియా విజయం
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).