
హైదరాబాద్: ఐపీఎల్-11 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎక్కడికెళ్లినా తిప్పలు తప్పట్లేదు. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడులో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో చెన్నైలో నిర్వహించాల్సిన మ్యాచ్లను పుణెకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పుణెలో మ్యాచ్లు జరిగే పరిస్థితులు కనిపించట్లేదు.
ఈ స్టేడియంలో ఆరు ఐపీఎల్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. కానీ, పుణె మైదానాన్ని సిద్ధంచేసేందుకు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పవానా డ్యాం నుంచి నీటిని ఉపయోగించొద్దని మహారాష్ట్ర క్రికెట్ సంఘాన్ని(ఎంసీఏ) బాంబే కోర్టు ఆదేశించింది. పుణె స్టేడియానికి పవానా నది నుంచి నీటి సరఫరా జరుగుతోందని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు లక్షలాది లీటర్ల నీరు ఉపయోగించాల్సి వస్తుందని.. ఇప్పటికే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని కోర్టుకు వివరించారు.
పుణె స్టేడియానికి నీటిని తరలిస్తే ఆ ప్రాంత ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. మునుపటి ఒప్పందం ప్రకారం ఎంసీఏ ఎలాంటి పరిశ్రమలు నడపడంలేదు. మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కూడా ఆదేశించామని జస్టిస్ ఓకా తెలిపారు. నీటిని పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలని ఐపీఎల్ మ్యాచ్ల కోసం కాదని తన తీర్పులో వెల్లడించింది.
పుణె వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం వినియోగించే నీటిని ఎలా సమకూర్చుకుంటున్నారో తమకు వివరణి ఇవ్వాలని మహారాష్ట్ర క్రికెట్ సంఘం(ఎంసీఏ)కు కోర్టు గత వారం కోర్టు నోటీసులు పంపించింది. నోటీసులపై ఏప్రిల్ 18లోగా సమాధానం చెప్పాలని గడువు కూడా విధించిన విషయం తెలిసిందే.