Bomb Threat: భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(DDCA)కు శుక్రవారం ఉదయం అరుణ్ జైట్లీ స్టేడియాన్ని బాంబులు పెట్టి పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దేశ రాజధానిలోని ఈ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఇది హోంగ్రౌండ్. ఐపీఎల్ టోర్నమెంట్ను ఒక వారం పాటు నిలిపివేయడానికి ముందు ఉన్న షెడ్యూల్ ప్రకారం.. మే 11న ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ 2025 మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
డీడీసీఏ ఉన్నతాధికారి ఒకరు దీనిని ధ్రువీకరించారు. దీని గురించి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించామని ఆయన చెప్పారు. ఉదయం బెదిరింపు మెయిల్ రావడంతో ఢిల్లీ పోలీసులను సంప్రదించామని.. వారు స్టేడియాన్ని తనిఖీ చేశారని కూడా వెల్లడించారు. భారత్ అంతటా పాకిస్థాన్ కు విధేయులైన స్లీపర్ సెల్స్ ఉన్నాయని.. ఆపరేషన్ సిందూర్ కోసం వాటి యాక్టివేట్ చేస్తామని బెదిరింపు ఈ-మెయిల్లో ఉంది.

ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న సైనిక చర్య తర్వాత జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ బీసీసీఐ శుక్రవారం అధికారికంగా ఐపీఎల్ను వారం పాటు నిలిపివేసింది. ధర్మశాలలో జరిగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కు వైమానిక దాడి అంతరాయం కలిగించిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ఐపీఎల్ ఇప్పుడు ఒక వారం పాటు వాయిదా పడింది. పరిస్థితిని బట్టి ఐపీఎల్ కొత్త షెడ్యూల్ ప్రకటించబడుతుంది.
సరిహద్దులో ఉద్రిక్తత ఒక వారం కంటే ఎక్కువ కాలం కొనసాగితే.. జూన్ మొదటి వారంలో టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించాల్సి ఉన్నందున బీసీసీఐ దానిని చాలా కాలం పాటు వాయిదా వేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి ఏర్పడితే బోర్డు దృష్టి ఆగస్టు-సెప్టెంబర్ విండోపై ఉంటుంది.