భారత మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు నేడు. అయితే ధోనీ తన 43వ బర్త్డే సెలబ్రేషన్స్ను చాలా సింపుల్గా చేసుకున్నాడు. అతికొద్ది మంతి ఆత్మీయుల సమక్షంలో కేక్ను కట్ చేసి స్పెషల్ డేను ప్రత్యేకంగా మలుచుకున్నాడు. శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో కేక్ను మహీ కట్ చేశాడు.
ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను ధోనీ సతీమణి సాక్షి సింగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ధోనీ ముందుగా సాక్షికి కేక్ను తినిపించాడు. అనంతరం ధోనీ కాళ్లకు సాక్షి నమస్కరించింది. ఇవాళ ధోనీ బర్త్డే కావడంతో బీసీసీఐ, ఐపీఎల్ టీమ్స్ ధోనీ కోసం ప్రత్యేకమైన పోస్టర్లను రిలీజ్ చేశారు.

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలతో ధోనీ ఉన్న ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. నిజమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సీఎస్కే స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. జింబాబ్వే పర్యటనలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ధోనీకి వీడియో కాల్లో శుభాకాంక్షలు చెప్పాడు. కాగా, ధోనీ అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు.

మరోవైపు ఏపీలో ధోనీ జన్మదిన సందర్భంగా అభిమానులు మహీ 100 అడుగుల కటౌట్ను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ '100' అడుగుల కటౌట్ను పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రతి ఏడాది ధోనీ కటౌట్ను ఏర్పాటు చేస్తున్నట్లు అంబారుపేట స్థానికులు తెలిపారు. గత ఏడాది 77 అడుగుల ఎత్తుతో కటౌట్ ఏర్పాటు చేశామని చెప్పారు.
సారథిగా ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలను దేశానికి అందించిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు మహీ అయిదు టైటిళ్లు అందించాడు. అయితే గత సీజన్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ వికెట్కీపర్గా సీఎస్కే జట్టులో కొనసాగుతున్నాడు.