
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుస్తుందనే ఆశ అడియాస కావడంతో సగటు అభిమానులు ఎంతగా ఆవేదన చెందుతున్నారో చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభంలో హాట్ ఫేవరెట్గా నిలిచిన టీమిండియా, దీనికి అనుగుణంగా అద్భుతంగా రాణించింది. వరుస విజయాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. లీగ్ దశలో భారత్ను ఓడించే జట్టే లేకపోయింది. ఇంగ్లండ్తో మ్యాచ్ తప్ప, ఎవరికీ తలవంచలేదు భారత జట్టు. ఈ ప్రదర్శన ప్రపంచకప్పై ఆశలను రెట్టింపు చేసింది. అనూహ్యంగా- సెమీఫైనల్లో చతికలిపడింది. అంతే అనూహ్యంగా సెమీ ఫైనల్కు చేరిన న్యూజిలాండ్ జట్టు.. భారత్ను ఓడిస్తుందని ఎవరూ కల్లో కూడా ఊహించి ఉండరు.
ఇదలావుంచితే- ప్రస్తుతం జట్టు క్రికెటర్లు సైతం నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయారు. ఎవరి ముఖాల్లోనూ కాంతి లేదు.. శాంతి అంతకంటే లేదు. నాసిరకమైన ఆటతీరును ప్రదర్శించి ఉంటే ఇంత నిరాశ చెంది ఉండాల్సిన పని ఉండేది కాదు. అద్భుతంగా రాణించి, సెమీఫైనల్లో బోల్తా కొట్టడాన్ని చివరికి టీమిండియా క్రికెటర్లు సైతం ఊహించి ఉండరు. దిగ్భ్రాంతికి గురయ్యారు. షాక్ నుంచి కోలుకోలేపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశ మొత్తం టీమిండియాకు అండగా నిలిచింది. తామున్నామనే భరోసాను ఇస్తోంది. సగటు అభిమానులే కాదు.. బాలీవుడ్ ప్రముఖులు, సూపర్స్టార్లు సైతం భారత క్రికెటర్లకు ఊరడింపు పలుకుతున్నారు.
ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమి చవి చూసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ మొత్తం 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు..ఆరంభం నుంచే వికెట్లను కోల్పోతూ వచ్చింది. మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహేంద్రసింగ్ ధోనీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొద్దిసేపు ప్రతిఘటించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది.
అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, కరణ్ జొహార్, అమీర్ఖాన్, వరుణ్ ధావన్, అర్జున్ రామ్పాల్, రితేష్ దేశ్ముఖ్, సునీల్ షెట్టి, అనుపమ్ ఖేర్, సోనాక్షి సిన్హా.. వీళ్లంతా క్రికెటర్లకు బాసటగా నిలిచారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.