మరికొన్ని వారాల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మార్చి చివరి వారంలో లీగ్ ఆరంభమై మే నెలలో టోర్నీ ముగిసేలా నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రచారానికి దూకుడు పెంచింది. తమ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ను నియమించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ స్పాన్సర్ ఎతిహద్ ఎయిర్వేస్కు కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం తెలిసిందే. ఇటీలవ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఎతిహద్ ఎయిర్వేస్ కంపెనీకి సీఎస్కే స్పాన్సర్షిప్ హక్కులు ఇచ్చింది. ఎతిహద్కు ప్రచారకర్తగా ఉన్న కత్రినాకైఫ్ ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై తరఫున బరిలోకి దిగనుంది. గతంలో ఈ బాలీవుడ్ బ్యూటీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్రాండ్ అంబాసిడర్గా బాధ్యతలు నిర్వర్తించింది.

గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో సీఎస్కే విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న చెన్నై ఈ సీజన్లోనూ కప్ను సాధించాలని కసితో ఉంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపట్టాడు. 41 ఏళ్ల ధోనీ గతేడాది మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం తిరిగి ఫిట్నెస్ సాధించాడు.
కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో సీఎస్కే ప్లేయర్లను వ్యూహాత్మకంగా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ పవర్ హిట్టర్ డారిల్ మిచెల్ కోసం ఏకంగా రూ.14 కోట్లు వెచ్చింది. అయితే భారత కుర్రాడు సమీర్ రిజ్వీ కోసం రూ.8.40 కోట్లు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శార్దూల్ ఠాకూర్ను (రూ.4 కోట్లు) తిరిగి సొంతం చేసుకుంది. అలాగే బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ (రూ.2 కోట్లు), కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర (రూ.1.80 కోట్లు), సిరిసిల్ల కుర్రాడు అవనీశ్ రావు (రూ.20 లక్షలు)ను వేలంలో దక్కించుకుంది.