వార్మప్ మ్యాచ్కి వర్షం అడ్డంకి: టాస్ పడకుండా తొలిరోజు ముగిసిన ఆట

హైదరాబాద్: దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య గురువారం ప్రారంభం కావాల్సిన మ్యాచ్కి వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో టాస్ కూడా వేయలేదు. ఫలితంగా టాస్ పడకుండానే తొలిరోజు ఆట ముగింది. ఈ మేరకు తొలిరోజు ఆటను ముగిసినట్లు అంఫైర్లు ప్రకటించారు. మూడు రోజుల వార్మప్ మ్యాచ్ విజయనగరం శివారులోని డా.పీవీజీ రాజు క్రీడా మైదానంలో గురువారం ఫ్రారంభం కావాల్సి ఉంది.
అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి విజయనగరంలో వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి కూడా భారీ వర్షం పడింది. దీంతో మైదానం తడిగా ఉండటంతో రెండు జట్లు డ్రస్సింగ్ రూంకే పరిమితమయ్యాయి. వర్షం తగ్గితే మ్యాచ్ నిర్వహించేందుకు నిర్వాహాకులు ఏర్పాట్లు చేశారు. అయితే, వర్షం ఎంతకీ తెరపనివ్వకపోవడంతో అంఫైర్లు తొలిరోజు మ్యాచ్ని రద్దు చేశారు.
మరోవైపు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు పాల్గొంటున్నందున ఈ వార్మప్ మ్యాచ్ ఎలాగైనా జరగాలని భారత క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు కెప్టెన్ రోహిత్శర్మ, దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ పిచ్ను పరిశీలించి తిరిగి డ్రస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు.

ప్రధాన ఆకర్షణగా రోహిత్ శర్మ
ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా రోహిత్ శర్మ నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అలవాటు లేని ఓపెనింగ్ స్థానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయనున్నాడు. యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. దక్షిణాఫ్రికాపై మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా తరఫున వీరిద్దరే ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు.

27 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ
భారత్ తరుపున ఇప్పటివరకు రోహిత్ శర్మ మొత్తం 27 టెస్టులు ఆడాడు. 39.62 యావరేజితో 1585 పరుగులు సాధించిన అతడు టెస్టు క్రికెట్లో పూర్తిగా విఫలమయ్యాడు. టెస్టుల్లో సుస్థిరం చేసుకునేందుకు రోహిత్ శర్మకు ఇది సువర్ణావకాశం. సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్మెంట్ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్కు ఓపెనర్గా పంపాలని నిర్ణయించాయి.

ఎలా సద్వినియోగం చేసుకుంటాడో
ఈ అవకాశాన్ని రోహిత్ శర్మ ఎలా సద్వినియోగం చేసుకుంటాడన్నది ఆసక్తికరంగా ఉంది. కగిసో రబాడ, వెర్నార్ ఫిలాండర్, లుంగి ఎంగిడి వంటి పేసర్లను ఓపెనర్గా రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఎదుర్కోనున్నాడు. దీంతో తొలి టెస్టుకు ముందు అతడికిది మంచి ప్రాక్టీసే అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

రోహిత్కు బ్యాకప్గా గిల్, పాంచాల్
రోహిత్ శర్మ రాణించని పక్షంలో శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ వంటి ఇతర ఓపెనర్లు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల నిలకడగా ఆడుతున్న కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్లతో బోర్డు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు బుమ్రా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న ఉమేశ్ యాదవ్కు ఈ వార్మప్ మ్యాచ్ ఎంతో కీలకం.

వికెట్ కీపర్గా కేఎస్ భరత్
ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఈ మ్యాచ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. టెస్టుల్లో రిషబ్ పంత్కు ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా సెలక్టర్లు భరత్పై దృష్టిసారించిన నేపథ్యంలో అతడు ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ వన్డే వరల్డ్కప్ తర్వాత తొలిసారి మైదానంలోకి దిగుతున్నాడు. ఓపెనర్ మార్క్రమ్ ‘ఎ' జట్టు తరఫున సెంచరీ సాధించి ఫామ్లోకి వచ్చాడు.

ప్రధాన పేసర్గా ఫిలాండర్
చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న ఫిలాండర్ ఈ సిరిస్లో ప్రధాన పేసర్గా బరిలోకి దిగుతున్నాడు. టి20 సిరీస్లో విఫలమైన రబడ టెస్టు సిరిస్లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. మరోవైపు కేశవ్ మహరాజ్, ముత్తుస్వామిల స్పిన్ ఏమేరకు భారత క్రికెటర్లను కట్టడి చేస్తుందో చూడాలి మరి. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు అక్టోబరు 2న విశాఖ వేదికగా ఆరంభం కానుంది.

జట్ల వివరాలు
బోర్డు ఎలెవెన్ : రోహిత్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, కేఎస్ భరత్, జలజ్ సక్సేనా, ధర్మేంద్ర సింగ్ జడేజా, అవేష్ ఖాన్, ఇషాన్ పొరెల్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), బవుమా, డి బ్రుయెన్, డి కాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్ మహరాజ్, మార్క్రమ్, సెనురాన్ ముతుస్వామి, ఇన్గిడి, నోర్టె, ఫిలాండర్, పీట్, రబడ, రూడీ సెకండ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications