
హైదరాబాద్: దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్శర్మ డకౌట్గా వెనుదిరిగాడు. మూడోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన టీమిండియా స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. భారీ అంచనాల మధ్య ఈ మ్యాచ్లో బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఆడిన రెండో బంతికే పెవిలియన్ చేరాడు. సఫారీ పేసర్ వెర్నన్ ఫిలాండర్ బౌలింగ్లో ఆడిన రెండో బంతికే కీపర్ హెన్రిచ్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఓపెనర్గా సద్వినియోగం చేసుకోవాలని భావించిన రోహిత్ శర్మకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం 46 ఓవర్లకు గాను టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సిధ్ధార్ద్ లాడ్(12), శ్రీకర్ భరత్(3) పరుగులతో ఉన్నారు.
భారత బ్యాట్స్మెన్లలో ప్రియాంక్ పాంచాల్(60) హాఫ్ సెంచరీతో రాణించగా... ఓపెనర్ మయాంక్ అగర్వాల్(39), అభిమన్యు ఈశ్వరన్(13), కరుణ్ నాయర్(19) నిరాశపరిచారు. ప్రస్తుతం టీమిండియా 128 పరుగుల వెనుకంజలో ఉంది. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తొలి రోజు వర్షం కారణంగా రద్దు కాగా, రెండో రోజు దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
శుక్రవారం 50 ఓవర్ల పాటే సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ మర్క్రమ్(100) సెంచరీకి తోడు బావుమా(87 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. బోర్డ్ ప్రెసిడెంట్స్ జట్టులో స్పిన్నర్ ధర్మంద్రసిన్హ్ జడేజా మూడు వికెట్లతో రాణించాడు.