
హైదరాబాద్: దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. విజయనగరంలోని పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తొలి రోజు వర్షం కారణంగా రద్దు కాగా.... రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో టెంబా బావుమా(55) పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో ధర్మేంద్రసిన్హ్ జడేజా రెండు వికెట్లు తీయగా... ఉమేశ్ యాదవ్, ఇషాన్ పోరెల్ తలో వికెట్ తీసుకున్నారు. శుక్రవారం ఉదయం కూడా ఔట్ఫీల్డ్ తడిగా ఉండడంతో మధ్యాహ్నాం నుంచి ఆట ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు షాకిచ్చారు. జట్టు స్కోరు 23 పరుగుల వద్ద ఓపెనర్ డీన్ ఎల్గర్(6) ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో పాంచాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత పది పరుగుల వ్యవధిలోనే ఇషాన్ పోరెల్ బౌలింగ్లో థియునిస్ డి బ్రూయిన్(6) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మర్క్రమ్ సెంచరీతో అదరగొట్టాడు.
33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన మర్క్రమ్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. హమ్జా(22)తో కలిసి మూడో వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యం, బావుమాతో కలిసి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ క్రమంలో మర్క్రమ్ 118 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు.
సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్(9) పరుగుల వద్ద పెవిలియన్కు చేరడంతో రెండో రోజు ఆట ముగిసినట్లు అంఫైర్లు ప్రకటించారు. మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో ఇంకో రోజు మ్యాచ్ మాత్రమే ఆట మిగిలి ఉంది. దీంతో ఈ వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.