

హైదరాబాద్: రెండు వన్డేల్లో టీమిండియా తరపున తొలి సిక్సును బాది ఇన్నింగ్స్లో చక్కని స్కోరును అందించిన శార్దూల్ ఇంగ్లాండ్కు భారీ పరుగులు అందించాడు శార్దూల్. అంతకు ముందు వరకు రిజర్వ్ బెంచీకి పరిమితమై సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్లో ఆడటం అంత సులువేం కాదని టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. సిద్ధార్థ్ కౌల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు ఇంగ్లాండ్తో చివరి మ్యాచ్లో తీవ్ర ఒత్తిడిని అనుభవించాడు. 10 ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చాడు.
'సిరీస్ చివరి మ్యాచ్లో అవకాశం వచ్చినప్పుడు జట్టుకు విజయం అందించాలనే ప్రతి ఆటగాడి మనసులో ఉంటుంది. ఈ మ్యాచ్యే కాదు.. ఎలాంటిదైనా సరే, భారత్, భారత్-ఏ లాంటి ఏ జట్టుకైనా సరే. మ్యాచ్ ఓడిపోవడం దురదృష్టకరం. మొత్తంగా చూస్తే మేం బాగానే ఆడాం. ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ టీ20, వన్డే సిరీస్ నుంచి బ్యాట్స్మెన్ నేర్చుకుంది చాలా ఉపయోగపడుతుంది.'
'ఈ పిచ్లపై ఎలా బ్యాటింగ్ చేయాలి, ఎలా బౌలింగ్లో చేయాలో ఆటగాళ్లకు అవగాహన ఏర్పడింది. శిఖర్, కోహ్లీ ఆడినంత వరకు మ్యాచ్ బాగానే సాగింది. మధ్యలో వెంటవెంటనే వికెట్లు చేజార్చుకోవడంతో 300 పరుగులు చేయలేకపోయాం. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కుల్దీప్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. సొంత పిచ్లపై వారే ఫేవరెట్ అనే సంగతి మర్చిపోకూడదు. అంతకు ముందు ఆసీస్పై వారు బాగా ఆడారు' అని శార్దూల్ ఠాకూర్ అన్నాడు.
'చివరి మ్యాచ్ను దక్షిణాఫ్రికాలో ఆడా. అప్పుడు మేం సిరీస్ గెలవగలిగాం. అంతకు ముందే మేం ఆధిక్యంలో ఉండటంతో చివరి మ్యాచ్ గెలవడం మాకు తప్పనిసరేమీ కాదు. దాంతో ఆ రోజు ఒత్తిడేం అనిపించలేదు. కానీ, ఇంగ్లాండ్తో చివరి మ్యాచ్ సిరీస్ గెలవడంలో కీలకం. కాబట్టి మ్యాచ్లో కాస్త ఆందోళనకు గురైయ్యా. బాధ్యతాయుతంగా ఆడటం ఆటగాడిగా నా బాధ్యత. కొన్నిసార్లు విజయం వరిస్తుంది. అలాగే.. కొన్నిసార్లు ఓటమిని ఎదుర్కోక తప్పదు' అని ఠాకూర్ తెలిపాడు.