Pakistan: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా శనివారం జరిగిన ఓ ఉగ్రదాడిలో ఒకరు మరణించారు. స్టేడియంలో క్రికెట్ ఆడుకుంటున్నయువకులను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఉగ్రదాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ దాడితో ఉగ్రవాదం మళ్లీ పంజా విసురుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. క్రికెట్ మైదానంలో జరిగిన ఈ దాడి, పాకిస్థాన్లో క్రికెట్పై ఉగ్రవాదం ప్రభావం చూపుతోందని మరోసారి రుజువు చేసింది. ఇది దేశంలోని క్రీడా కార్యకలాపాలకు, పౌరుల భద్రతకు పెను ప్రమాదంగా మారింది.
ఐఈడీతో దాడి
ఈ పేలుడు బజౌర్ జిల్లాలోని ఖర్ తహసీల్లో ఉన్న కౌసర్ క్రికెట్ గ్రౌండ్లో సంభవించింది. ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. బజౌర్ జిల్లా పోలీస్ అధికారి వకార్ రఫీక్ ఈ ఘటనను ధ్రువీకరించారు. ఐఈడీ(ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్)ని ఉపయోగించి ఈ దాడి జరిగిందని తెలిసింది. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు.

ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు. అయినప్పటికీ పోలీసులు ఈ దాడి వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గత నెలలో పాకిస్థాన్ భద్రతా దళా లు ఉగ్రవాదుల ఏరివేత కోసం 'ఆపరేషన్ సర్బకాఫ్' ప్రారంభించాయి. దానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను పెంచుతున్నారనడానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పెరిగిన హింస
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. గత శనివారం కూడా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో రెండు వేర్వేరు ఘటనలు జరిగాయి. కోహట్ జిల్లాలోని లాచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో ముగ్గురు మిలిటెంట్లు మరణించారు. ఇదే రోజున లాచీ తహసీల్లోని దర్మలక్ పోలీస్ చెక్పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు పోలీసు వ్యాన్పై దాడి చేయగా.. ఓ కానిస్టేబుల్ మరణించారు. ఈ ఘటనలు ఈ ప్రాంతంలో భద్రతా సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి.