విశాఖపట్నం: టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది తొలిసారి. టెస్టు మ్యాచ్కి ఓ అనుకోని అతిథి టెస్టు మ్యాచ్కి అంతరాయం కలిగించడంతో ముందుగానే టీ విరామాన్ని ఇచ్చారు. వివరాల్లోకి వెళితే భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోకి ఓ అనుకోని అతిథి విచ్చేసింది. దీంతో మైదానంలోని అంపైర్లు రెండో సెషన్ టీ విరామం ముందుగానే ఇచ్చారు. టీమిండియా బ్యాట్స్మెన్లు కోహ్లీ( 91 వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు), పుజారా (97 నాటౌట్) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఓ కుక్క మైదానంలోకి ప్రవేశించింది.
మైదానంలోని అన్ని వైపులకూ ఉరుకులు పరుగులు పెడుతూ కాసేపు చికాకు తెప్పించింది. కుక్క మైదానంలోకి ప్రవేశించడంతో అక్కడున్న వారికి అది నవ్వులు తెప్పించింది. ఇదే సమయంలో మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కుక్కను భయపెట్టే ప్రయత్నం చేశాడు.

అయినప్పటి అది ఏ మాత్రం భయపడకుండా పరుగులు పెట్టింది. వెంటనే రంగంలోకి దిగిన మైదాన సిబ్బంది దానిని తరిమేసే ప్రయత్నం చేశారు. మైదాన సిబ్బందిలో ఒకరు కుక్కపైకి షూ విసిరాడు. దాంతో ఆ కుక్క మైదానం మొత్తం ఉరుకులు పరుగులు పెట్టింది.
దాంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే రెండో సెషన్ టీ విరామ సమయాన్ని ముందే ఇచ్చేశారు. దీంతో విరాట్ కోహ్లీ, పుజారాల సెంచరీలు కాస్తంత ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇదే స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్లో కుక్క వచ్చి హడావుడి సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు నష్టానికి 317 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 90 ఓవర్ల ఆటలో ఛటేశ్వర పుజారా(119), కెప్టెన్ విరాట్ కోహ్లీ(151)లతో చెలరేగిపోయారు. 154 బంతుల్లో సెంచరీ సాధించిన కోహ్లీ 150 పరుగులను 238 బంతుల్లోనే సాధించాడు.

15 ఫోర్లు, 62.87 స్ట్రయిక్ రేట్తో ఉన్న కోహ్లీ డబుల్ సెంచరీ చేసే దిశగా దూసుకుపోతున్నాడు. ఆట ముగుస్తున్న సమయంలో భారత్ వికెట్ కోల్పోయింది. 89వ ఓవర్ మూడో బంతికి అండర్సన్ బౌలింగ్లో రహానే కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 61 బంతులు ఎదుర్కొన్న రహానే 23 పరుగులు చేశాడు.
దీంతో 88.3 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లను నష్టపోయి 316 పరుగులు చేసింది. రహానే తర్వాత అశ్విన్ క్రీజ్లోకి వచ్చాడు. అశ్విన్తో జతకలిసిన కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ 151, అశ్విన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ మూడు వికెట్లు తీసుకోగా, స్టువర్ట్ బ్రాడ్ ఒక వికెట్ తీశాడు.