
న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) మాజీ అధ్యక్షుడు, దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనను భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన డీడీసీఏలో తన సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు. అలాగే స్టేడియంలో స్టాండ్కు తన పేరును తొలగించాలని అసోసియేషన్కు లేఖ రాశారు. డీడీసీఏలో బంధుప్రీతి పెరిగిపోయిందనేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.
డీడీసీఏకు ఆటగాళ్ల కంటే క్రికెట్ పాలకులే ఎక్కువైపోయారని, బంధుప్రీతి బాగా పెరిగిపోయిందని బిషన్ సింగ్ బేడీ ఆరోపించారు. ఈ విషయమై ప్రస్తుతం డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీకి బేడి ఘాటు లేఖ రాశారు. 'నాకు ఎంతో ఓర్పు, సహనం ఉన్నాయి. కానీ ఇప్పుడవి పూర్తిగా నశిస్తున్నాయి. డీడీసీఏ నన్ను ఎంతగానో పరీక్షించి, ఈ తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేసింది. కోట్లా స్టేడియంలోని స్టాండ్కున్న నా పేరును వెంటనే తొలగించండి. నేను డీడీసీఏ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటున్నా' అని బేడి ఈ లేఖలో పేర్కొన్నారు.
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ 1999 నుంచి 2013 వరకు పని చేశారు. జైట్లీ డీడీసీఏకు 14 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రోహన్ జైట్లీ ఆ పదవిలో కొనసాగుతున్నారు. గతేడాది అనారోగ్య సమస్యలతో అరుణ్ జైట్లీ మరణించాక ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి ఆయన పేరే పెట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా ఆరడుగుల ఎత్తుతో జైట్లీ విగ్రహాన్ని స్టేడియంలో నెలకొల్పాలని డీడీసీఏ నిర్ణయించడం బేడీకి ఆగ్రహం తెప్పించింది.