
ప్రమాద స్థాయి వాతావరణం:
సాధారణంగా గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 0-50 మధ్య ఉంటే మంచి వాతావరణం ఉంటుంది. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరమైనది, 101-200 మధ్య ఉంటే మితమైనది, 201-300 తక్కువగా, 301-400 చాలా తక్కువగా, 401-500 మధ్య ఉంటే ప్రమాద స్థాయిగా పరిగణించబడుతుంది. ఇక 500 పైన ఉంటే అతి తీవ్రమైన ప్రమాదంగా చూస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రమాద స్థాయి వాతావరణం ఉంది. ఈ తీవ్రమైన కాలుష్య స్థాయి ఉండడంతో.. అసలు ఢిల్లీకి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించే అర్హత ఉందా? అని భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి నిప్పులు చెరిగారు.

ఢిల్లీకి అర్హత ఉందా:
'ఢిల్లీలో ప్రస్తుతం ప్రమాదకర గాలి నాణ్యత ఉంది. జైట్లీ స్టేడియంలో నవంబర్ 3న టీ20 మ్యాచ్ ఆడనున్న భారత్-బంగ్లాదేశ్ జట్లు గురించి ఆలోచించండి. మన మానవ నిర్మిత బలహీనతలను అంగీకరిద్దాం. ఇలాంటి వాతావరణం మనమే సృష్టించాం. అసలు ఢిల్లీకి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించే అర్హత ఉందా?' అని బిషన్ సింగ్ బేడి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వేదిక మార్చాలి:
మరోవైపు బుధవారం గాలి నాణ్యత ప్రమాద స్థాయికి పడిపోయిందని ఢిల్లీ పర్యావరణవేత్తలు తెలిపారు. ఆటగాళ్లు ప్రమాద బారిన పడకుండా ఢిల్లీ వేదికను మార్చాలని అక్కడి పర్యావరణవేత్తలు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఓ లేఖ రాశారు. 'దీపావళి సందర్భంగా ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం అధికంగా ఉంది. గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. తొలి టీ20 కోసం ఢిల్లీ వేదికను మార్చాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నాం. విషపూరిత గాలిలో ఇరు జట్లు 3-4 గంటలు క్రికెట్ ఆడుతారు కాబట్టి.. ఆటగాళ్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది' అని జ్యోతి పాండే, రవీనా రాజ్ కోహ్లీ పేర్కొన్నారు.
మ్యాచ్ ఆడడం చాలా కష్టం:
'మ్యాచ్ చూడటానికి వేలాది మంది ప్రేక్షకులు స్టేడియానికి వస్తారు. అందరూ ప్రమాదంలో పడతారు. శ్వాసకు సంబందించిన సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితులలో మ్యాచ్ ఆడడం చాలా కష్టం' అని ఢీల్లి పర్యావరణవేత్తలు చెప్పుకొచ్చారు. గతంలో ఢిల్లీలో ఆటగాళ్లు మాస్క్లు ధరించి ఇక్కడ ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2017, డిసెంబర్లో శ్రీలంక ఆటగాళ్లు ముఖానికి మాస్క్లు ధరించి ఆడారు. అయినా రెండు మూడు సార్లు మ్యాచ్కు అంతరాయం కలిగింది.


Click it and Unblock the Notifications












