హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురువారం 36వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన సహచర క్రికెటర్లతో పాటు మాజీలు పలువురు ధోనికి శుభాకాంక్షలు చెప్పారు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న ధోని పుట్టినరోజుని భారత జట్టు ఆటగాళ్లు జట్టు బస చేసిన హోటల్లోనే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధోని తన 36వ పుట్టినరోజుని భార్య సాక్షితో పాటు జట్టు సభ్యులతో కలిసి జరుపుకున్నాడు. ధోని కేక్ కట్ చేసిన ఫోటోని సహచర ఆటగాడు హార్ధిక్ పాండ్యా తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.
కాగా, గురువారం కింగ్స్టన్లో జరిగిన చివరి వన్డేలో విండిస్పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి పరిమిత ఓవర్ల క్రికెట్లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది.
దీంతో 3-1 తేడాతో సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. ఐదో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ భారత బౌలర్లు మహ్మద్ షమీ(4/48), ఉమేశ్ యాదవ్(3/53) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. విండిస్ బ్యాట్స్మెన్లలో హోప్ సోదరులు షెయ్(51), కైల్(46) రాణించారు.
ఆనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ, దినేశ్ కార్తిక్ అర్ధ సెంచరీతో రాణించడంతో 36.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన విండిస్ చివరిదైన ఐదో వన్డేలో పోరాట పటిమ ప్రదర్శించలేకపోయింది.
నాలుగో వన్డేలో లాగే ఛేదనలో భారత్ను కట్టడి చేసి సిరీస్ను సమం చేయాలనుకున్న విండీస్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (111 నాటౌట్: 115 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల)తో కదం తొక్కడంతో చేతులేత్తేసింది. ఈ మ్యాచ్లో సెంచరీతో రాణించిన కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించగా, సిరిస్లో అద్భుత ప్రదర్శన చేసిన రహానేకు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' లభించింది.