ముంబై: కెమెరా ముందు నిలబడి నటించడం కంటే స్టేడియంల క్రికెట్ బంతిని ఎదుర్కోవడం చాలా తేలిక అంటున్నాడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'సచిన్' చిత్రంలో నటించడంపై స్పందిస్తూ టెండూల్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మైదానంలో చుట్టూ కెమెరాలున్నా అవేమీ పట్టించుకోకుండా.. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నా నని.. అయితే ఉన్నట్టుండి కెమెరా ముందు నిలబడి నటించమంటే ఏదోలా ఉందని సచిన్ చెప్పుకొచ్చాడు. గురువారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఏ ఆటగాడికైనా ఫిట్నెస్ ఎంతో కీలకమని.. చిన్నతనంలోనే దృఢంగా తయారైతే గొప్ప స్థాయికి ఎదగొచ్చని ఇందుకు తన క్రీడా జీవితమే ఉదాహరణగా పేర్కొన్నాడు. ''కోచ్ అచ్రేకర్ వద్ద నా సాధన ఉదయం 7 గంటలకే మొదలయ్యేది. 9.30 వరకు సాగేది. అర గంట విరామం తర్వాత 10 గంటల నుంచి సాయంత్రం 4.30 దాకా మ్యాచ్ ఆడేవాళ్లం. తర్వాత మళ్లీ నెట్ సెషన్ ఉండేది. ప్యాడ్లు కట్టుకునే మైదానమంతా రెండు రౌండ్లు వేయమనేవారు. నాకు తెలియకుండానే ఇలా నా కెరీర్కు పునాది పడింది. అచ్రేకర్ సార్ ఇలా కష్టపెట్టాడు కాబట్టే ఆ తర్వాత నేను మారథాన్ ఇన్నింగ్స్లు ఆడగలిగాను. 326 పరుగులు చేసి అజేయంగా నిలవగలిగాను. ఆ ఇన్నింగ్స్లన్నీ ఎంతో ఆస్వాదించా'' అన్నాడు.

''కొన్నిసార్లు వరుసగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి అలసిపోయాను. అలాంటి సందర్భాల్లో మానసిక దృఢత్వమే నన్ను నడిపించింది. క్రికెట్లో ఎన్నో దెబ్బలు తింటాం. ఐతే గాయపడ్డా కూడా మన బాధను ప్రత్యర్థికి తెలిసేలా చూపించకూడదు. నేను గాయాలకు, నొప్పికి అలవాటు పడిపోయాను. కొన్నిసార్లు గాయమైన కొన్ని నెలలకు స్కానింగ్లో అసలు సంగతి తెలిసేది. పక్కటెముక విరిగినా మూడు నెలల పాటు అలాగే ఆడానని ఓ సందర్భంలో వెల్లడైంది'' అని సచిన్ చెప్పాడు. టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రం టీజర్ను గురువారం విడుదల చేశారు.