
ముంబై: భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుంది. క్రికెట్ మించి.. అనే భావోద్వేగాలు ఈ రెండు దేశాల ప్రజల మధ్య నెలకొంటుంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా కిందటి నెల 24వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రెండు దేశాలకు చెందిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్పై అంచనాలు ఏ రేంజ్లో నెలకొన్నాయో మనం చూశాం. ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటాయి ఇవి.
ఎప్పుడో ఒకసారి.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్లల్లో తప్ప భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగడం అనేది సాధ్యం కాదు. సాధారణంగా టీమిండియా.. క్రికెట్ ఆడే దేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ దేశాలతో ద్వైపాక్షిక సిరీస్ల కోసం ఆహ్వానిస్తుంటుంది. పాకిస్తాన్తో మాత్రం అది సాధ్యపడేది కాదు. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కాశ్మీర్ సమస్య.. వంటి అంతర్జాతీయ స్థాయి సమస్యలు ఈ రెండింటి మధ్య ముడిపడి ఉన్నాయి.
అందుకే భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ అనేది అస్సలు కుదిరేది కాదు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లల్లో తప్ప ఈ రెండు దేశాల జట్లు పరస్పరం పర్యటనలకు వెళ్లడం అనేది క్రికెట్ బోర్డుల చేతుల్లో లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సైతం స్పష్టం చేశాడు. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలనే నిర్ణయం తన చేతుల్లో లేదని స్పస్టం చేశాడు. తన కౌంటర్ పార్ట్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా సైతం ఈ విషయంలో ఏమీ చేయలేడని తేల్చి చెప్పాడు.
ద్వైపాక్షిక సిరీస్లను పునరుద్ధరించడం బీసీసీఐ చేతుల్లో గానీ లేదా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేతుల్లో గానీ లేదని పేర్కొన్నాడు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది.. రెండు దేశాల ప్రభుత్వాలేనని చెప్పాడు. రెండు దేశాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ సాధ్యపడుతుందని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్తో క్రికెట్ సిరీస్ స్తంభించిపోయి ఎన్నో సంవత్సరాలైందని, దాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు నిర్యం తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు.