గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమి వచ్చే సీజన్కు అందుబాటులో ఉండట్లేదు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ప్రస్తుతం చీలమండల గాయంతో బాధపడుతున్న షమి లండన్లో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
సర్జరీ అనంతరం షమి పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్తో పాటు టీ20 ప్రపంచకప్తో సహా స్వదేశంలో జరగనున్న న్యూజిలాడ్, బంగ్లాదేశ్ పర్యటనలకు కూడా షమి అందుబాటులో ఉండకపోవచ్చని పరోక్షంగా తెలిపాయి. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు అతడు రీఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించాయి.

''జనవరి చివరి వారంలో తన చీలమండ గాయానికి చికిత్స కోసం లండన్కు వెళ్లాడు. అక్కడ ప్రత్యేకమైన ఇంజెక్షన్లను తీసుకున్నాడు. మూడు వారాల తర్వాత గాయం తగ్గిపోతుందని, నెమ్మదిగా పరుగులు మొదలుపెట్టవచ్చని భావించారు. కానీ ఇంజెక్షన్లు పనిచేయలేదు. దీంతో ఇప్పుడు శస్త్రచికిత్స అనివార్యమైంది. సర్జరీ కోసం షమి త్వరలోనే యూకేకు వెళ్లనున్నాడు. అతడు ఐపీఎల్కు అందుబాటులో ఉండడు''
''అసలు షమి నేరుగా శస్త్రచికిత్స చేయించుకోవాల్సింది. ఎన్సీఏ అదే సూచించాల్సింది. రెండు నెలల విశ్రాంతి, ఇంజెక్షన్లు సరిపోలేదు. టీమిండియాకు అతడో గొప్ప ఆస్తి. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు భారత జట్టుకు కావాలి'' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ అనంతరం షమి టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్లో 24 వికెట్లతో సత్తాచాటాడు.
కాగా, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ షమి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ ఫైనల్కు చేర్చడంలో షమి కీలక పాత్ర పోషించాడు. ఇవాళ సాయంత్రం ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో షమి 17వ సీజన్కు దూరమైన వార్త.. గుజరాత్ టైటాన్స్ అభిమానులకే షాక్గా మిగిలింది.