న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్లోనూ అభిమానుల సంఖ్య పెరిగి పోతోంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
పాకిస్థాన్ మహిళా క్రికెటర్లకు కూడా అత్యంత పాపులర్ క్రికెటర్ కూడా కోహ్లీనే కావడం విశేషం. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తమకెంతో ఇష్టమైన ఆటగాడని పాకిస్థాన్ మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ సనా మీర్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది.
అయితే, తనకు మాత్రం టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫేవరెట్ క్రికెటరట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సనా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
'మా జట్టులో మహిళా క్రికెటర్లకు విరాట్ కోహ్లీ పాపులర్ క్రికెటర్. నాకు మాత్రం ధోనీ ఫేవరెట్ క్రికెటర్. ఎందుకంటే అతను భారత కెప్టెన్ కాబట్టి. మైదానంలో, బయటా ధోనీ ప్రవర్తన హుందాగా ఉంటుంది. జూనియర్లతో కూడిన జట్టును బలమైన టీమ్గా మార్చాడు' అని సనా చెప్పింది.
తమ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చి కుదురుకునే వరకు తాను ఒక ప్లేయర్ గా జట్టులో కొనసాగుతానని ఆమె వెల్లడించింది. కాగా, పాకిస్థాన్ మహిళ క్రికెట్ లో చాలా మార్పులు వస్తున్నాయని, క్రికెట్ కెరీర్గా ఎంచుకోవాలని చాలా మంది అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది.