ప్రస్తుతం టీమిండియాను సెలెక్ట్ చేసే కమిటీకి చీఫ్ అంటూ ఎవరూ లేరు. ఒక స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయిన చేతన్ శర్మ ఈ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం శివ సుందర్ దాస్ తాత్కాలికంగా చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ పదవికి వీరేంద్ర సెహ్వాగ్ను కూడా అడిగారట. కానీ జీతం తక్కువని వీరూ ఈ పదవి వద్దన్నాడని సమాచారం.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్కు ఏడాదికి రూ. కోటి జీతం ఇస్తుంది. కమిటీ సభ్యులకు ఏడాదికి రూ.90 లక్షల జీతం ఉంటుంది. ఇది చాలా తక్కువనే కారణంతోనే చాలా మంది మాజీ క్రికెటర్లు ఈ పదవులపై ఇంట్రస్ట్ చూపించడం లేదు. టీమిండియాకు సారధ్యం వహించిన దిలీప్ వెంగ్సర్కార్ (2006-2008), కృష్ణమాచారి శ్రీకాంత్ (2008-2012) ఈ పదవుల్లో పని చేసిన చివరి ప్రముఖ క్రికెటర్లు కావడం గమనార్హం.

వీరేంద్ర సెహ్వాగ్ను టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని కూడా గతంలో బీసీసీఐ కోరింది. అతను కాదనడంతో ఈ పదవి అనిల్ కుంబ్లేకు దక్కింది. ఇప్పుడు చీఫ్ సెలెక్టర్గా కూడా అతను దరఖాస్తు చేస్తాడని నమ్మకం లేదు. ఈ పదవికి దక్కే ప్యాకేజీ అతని స్థాయికి చాలా తక్కువ అని సమాచారం. బీసీసీఐకి చెందిన ఒక అధికారి ఈ విషయాలను వెల్లడించాడు.
అలాగే నార్త్ జోన్లో సెహ్వాగ్ స్థాయి ఉన్న ప్లేయర్ కూడా మరొకరు లేరని బీసీసీఐ అధికారి చెప్పాడు. ఇటీవలి కాలంలో యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ వంటి వాళ్లు క్రికెట్కు వీడ్కోలు పలికారు. వీళ్లంతా కూడా నార్త్ జోన్ వాళ్లే. కానీ ఈ పదవికి దరఖాస్తు చేయాలంటే రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు గడిచి ఉండాలి. దీంతో వీళ్లకు అప్పుడే అవకాశం దక్కడం జరగదు.
'సెలెక్షన్ కమిటీ చైర్మన్కు ఏటా రూ.4-5 కోట్ల ప్యాకేజీ ఇవ్వడం బీసీసీఐకి పెద్ద సమస్య కాదు. అలా చేస్తే చాలా సమస్యలు తీరతాయి కూడా. ప్రముఖ క్రికెటర్లు కూడా ఈ పదవులపై ఆసక్తి చూపుతారు' అని సదరు అధికారి వెల్లడించారు. అలాగే ఒక స్థాయి లేని వ్యక్తి చీఫ్ సెలెక్టర్ అయితే.. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి లేదంటే రాహుల్ ద్రావిడ్ వంటి వాళ్లతో మీటింగ్లో కూర్చున్నప్పుడు ఇబ్బంది పడతారని అభిప్రాయపడ్డాడు.
'దిలీప్ భాయ్ (దిలీప్ వెంగ్సర్కార్) చైర్మన్గా ఉన్నప్పుడు ఒకసారి అతని ముందు పెద్ద సమస్య వచ్చిపడింది. విరాట్ కోహ్లీ, ఎస్ బద్రీనాథ్ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్పి వచ్చింది. దీనికోసం ఆస్ట్రేలియాలో జరిగిన కొన్ని ఇండియా-ఎ గేమ్స్ చూశాడతను. అప్పుడే ఎవరికి మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే' అని తెలిపాడు.
అలాగే అంతకుముందు గ్రెగ్ ఛాపెల్ ముందు కూడా దిలీప్ చాలా బలంగా తన వాయిస్ వినిపించేవాడని సదరు అధికారి గుర్తుచేసుకున్నాడు. అలాంటి స్థాయి ఉన్న వాళ్లు ఈ పదవులు చేపట్టాలంటే మాత్రం బీసీసీఐ జీతాలు పెంచక తప్పదని తెలుస్తోంది. మరి బీసీసీఐ ఆ పని చేసి, ప్రముఖులను సెలెక్టర్ల సీటులో కూర్చోబెడుతుందేమో చూడాలి.