|
గాయం తిరగబెట్టిందా?
ఆస్ట్రేలియాలో బ్యాటింగ్ సందర్భంగా శిఖర్ ధావన్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ వేసిన ఓ బౌన్సర్ను ఆడే ప్రయత్నంలో శిఖర్ ధావన్ వేలికి గాయమైంది. పిచ్పై పడ్డ బంతి వేగంగా ధావన్ గ్లౌవ్స్ను తాకింది. ఈ ఘటనలో ఆయన వేలు స్వల్పంగా చిట్లి పోయింది. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందని ఆశించారు. అక్కడ ఫిజియోథెరపీ నిర్వహించారు. అయినప్పటికీ.. ఎలాంటి మార్పూ రాలేదు సరికదా వేలి గాయంలో మరింత వాపు కనిపించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రపంచకప్లో మిగిలిన మ్యాచ్లన్నింటికీ శిఖర్ ధావన్ దూరం అయ్యారు.
జూలై వరకు ఆడలేడు..
సుమారు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి శిఖర్ ధావన్ ఎడమ చేతి వేలి చివర్లను బలంగా తగిలిందని, ఫలితంగా అంతర్భాగంలో గాయం ఏర్పడిందని టీమిండియా ట్రైనర్ శంకర్ బసు తెలిపారు. శిఖర్ ధావన్ వేలి గాయంపై బుధవారం ఆయన లండన్లో విలేకరులతో మాట్లాడారు. బంతి బలంగా తగలడం వల్ల వేలి కొసలకు గాయమైందని, ఎముక చిట్లిందని చెప్పారు. రెండువారాల పాటు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకోగలుగుతాడని తాము ఆశించామని ఆయన అన్నారు. దీనికి భిన్నంగా గాయం మానలేదని, ఎలాంటి మార్పూ కనిపించట్లేదని చెప్పారు. ఇప్పుడిప్పుడే శిఖర్ ధావన్ వేలి గాయం నుంచి కోలుకోలేకపోవచ్చని అన్నారు. జూలై వరకు శిఖర్ ధావన్ క్రికెట్ ఆడలేడని శంకర్ బసు తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆయనను ప్రపంచకప్లో మిగిలిన మ్యాచులన్నింటికీ దూరంగా ఉంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. పలువురు నిపుణులను తాము సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
రిషబ్కు అవకాశం దొరికినట్టే..
కాగా- ప్రపంచకప్కు బయలుదేరి వెళ్లడానికి ముందు భారత జట్టు ప్రత్యామ్నాయ వనరులను సిద్ధంగా ఉంచుకున్న విషయం తెలిసిందే. జట్టులో ఎవరైనా గాయపడితే వారికి బదులుగా అప్పటికప్పుడు ఇంగ్లండ్కు పిలిపించుకోవడానికి కొందరు క్రికెటర్లను సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో- గాయపడ్డ శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్ను ఇంగ్లండ్కు పిలిపించుకుంది కూడా. శిఖర్ ధావన్లాగే ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. ఓపెనర్గా రాణించగల సత్తా కూడా అతనికి ఉంది. పైగా ఫుల్ టైమ్ వికెట్ కీపర్ కావడం కలిసి వచ్చే అంశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన మ్యాచ్లల్లో రిషబ్ పంత్ను ఆడించే అవకాశాలు లేకపోలేదు.
కేఎల్ రాహుల్ మళ్లీ మిడిలార్డర్కు వెళ్తాడా?
నిజానికి కన్నడిగుడు కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ ఓపెనర్. ఇదివరకు ఆయన పలు మ్యాచ్లలో రోహిత్ శర్మతో కలిసి జట్టుకు శుభ ఆరంభాలను ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీ మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడాడు. తొలి వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని జోడించాడు. ఆ మ్యాచ్లో శిఖర్ ధావన్ లేని లోటు కనిపించలేదు. దీనితో- ఓపెనర్గా రిషబ్ పంత్ను ఆడించాలా? లేక కేఎల్ రాహుల్ను కొనసాగించాలా? అనే సందిగ్ధావస్థను బీసీసీఐ ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది. రిషబ్ పంత్కు ఇప్పటిదాకా ప్రపంచకప్ ఆడిన అనుభవం లేదు. ఒత్తిడిని తట్టుకుని రాణించగలడా? అనే సందేహం బీసీసీఐలో నెలకొనింది. ప్రపంచకప్లో ప్రయోగాలు చేయడానికి బీసీసీఐ సిద్ధంగా లేదని, బెడిసి కొడితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు.